Aug 17, 2011

కుట్టనా...కుట్టనా...?!?

మొన్న పంద్రాగష్టున అన్ని ఛానెళ్ళతో పాటు ఓ జాతీయ ఛానెల్  వారు, పిల్లలకు జాతీయ గీతాల పోటీలు పెట్టారు. ముద్దుముద్దుగా ముచ్చటగా వాళ్ళు పాడేసారు. మనమేమో వినేసాం.,సారీ, చూసేసాం.

అక్కడికి నేను మాత్రం  తక్కువ తిన్నానేంటి?
రిమోట్ సవరించి  టకటకా బటన్లపై సరిగమలు నొక్కుతూ పోయా..
 ఇక్కడో పాట అక్కడో ఆట ..ఇక్కడో కవాతు అక్కడో కత్రినా..
మధ్యలో ఎక్కడి నుంచి  వచ్చాడబ్బా ... ఈ బోసి నవ్వుల తాతాజీ!

అదేనండి మరి నేను చెప్ప బోయేది.. మన అన్నాజీ గురించి.
అది అన్నా గారికి అందుతోన్న పాపులారిటీ కి ఒక చిన్న ఉదాహరణన్న మాట!
"ఫూలో సితారోకా సబ్ కా కహనా హై... లాఖో హజారో మే హమారీ అన్నా హై...!"అంటూ వందలాది మంది ప్రేక్షకులతో.. ఆయన గొంతు కలిపారు చూడండి.. సారీ సారీ.. వందలాది వేలాది లక్షలాది ..మంది ఆయన తో గొంతు కలుపుతున్నారు చూడండి ..ఎంత చూడ ముచ్చటగా కన్నుల పండువ గా ఉన్నదో కదా?

అరరే..మన్నించండి. ఇంకా రాఖీ పాట నన్నొదిలినట్టు లేదు.కలం సవరించుకో బోతూ గొంతు సవరించుకొన్నా ..తప్పు నాది కాదండి.అదో దేవానందం!

చిన్ని గొంతులు అంత ఆర్ద్రతతో .. "  ఓ నా దేశ ప్రజలారా..మీ కళ్ళను కాస్తంత చెమ్మగిల్ల నివ్వండి..."
(ఓ మేరే వతన్ కే లోగొన్..జర ఆంఖో మే భర్ లో పానీ..)
అంటూ హృద్యంగా పాడుతుంటే.. మరి గుండె చెమ్మగిల్లదా చెప్పండి?

అది సరే గానీండి...
ఎవరికి వాళ్ళం మన పాటికి మనం హాయిగా ఉద్యోగం సద్యోగం చేసుకొంటూ .. జీతం గీతం తీసుకొంటూ.. వ్యాపారంవ్యవహారం సాగిస్తూ ..ఆపై తృణమూఫణమూ సమర్పించుకొంటూ ,ఎవరిపాటికి వాళ్ళం బాగానే ఉన్నామే !

మరి ఈ పెద్దాయనకి మన గీతాల గురించెందుకు? పై రాబడులు ఆదాయప్రదానాలు ఎందుకు?
ధనమూలం ఇదం జగత్తు అని పెద్దలే కదా అన్నారు. నీతో అవినీతో ..చేతిలో చమురుంటే కదా ..నాలుగు దీపాలు వెలిగేది? అంతెందుకు ఏ అన్నయ్య నడిగినా చెపుతాడుకదా .. దీపమున్నప్పుడే ఇల్లు చక్క దిద్దుకోవాలని!

మరి మన అన్నాజీ చెప్పేదేమిటి?
ఒక దీపం వెలిగించడానికి కోట్లాది ఇళ్ళళ్ళో దీపాలు ఆర్పొద్దని!

ప్రజాధనానికి హక్కుదారులు ప్రజలే.
ప్రజాధనం ఆదాయప్రదానాలపై జావాబుదారితనం తప్పనిసరి.
అంతెందుకు?  మన రాందాసు గారినే అడిగి చూడండి.. "ఎవడబ్బ సొమ్మని.." ఆ దేవదేవుడినే కడిగి..'పాడే'సాడు!
ప్రజాధనమా మజాకా మరి !
మన సొమ్ము బాగోగులు మనం కాకపోతే ఎవరు చూసుకొంటారు చెప్పండి?

మనమేమైనా, నేలమాళిగల్లో నాగబంధాల్లో దాచి ఉంచుతున్నామా చెప్పండి. ఎప్పటికైనా ఎవరైనా బయటకు తీయడానికి.. వంగి వంగి వినయంగా..దండాలు పెడుతూ ..పదవులూపలహారాలు చేస్తూ.. అందంగా అనుకూలంగా  అందిన అధికారాల్లో మడిచి ముడిచి .. విదేశీ స్వదేశీ .. .ఇందుకాదందుకాదన్నట్టుగా
 ...చేతయిన చోటల్లా ...భద్రం చేసుకొంటంటిమి!

అయితే మాత్రం..
చూస్తూ ఊరుకొంటారటండి..!

సొమ్ములు పోనాయండి..
అందులోనూ.. పెజాసోమ్యం..లో !!! 

అదండి విషయం.

కాకపోతే, ఎవరి బంగారుపుట్టలో వేలు పెడితే ,
ఎవరు ఊరుకొంటారు చెప్పండి!
కుట్టరా మరి!

***
అయితే మాత్రం..
నిజాయితీ గల ప్రయత్నాలకు ..
మనమూ ఒక అక్షరం అందిస్తే ..పోయేదేముంది..
అవినీతి తప్ప!

అడుగడుగులో అడుగు కలుపుదాం...
ముందుకే సాగుదాం..
అమ్మల్లారా, అయ్యాల్లారా.. అన్నల్లారా చెల్లెల్లారా..
ఒక్కసారి పిడికిలి బిగించి గట్టిగా అనండి...
***
అన్నాజీ ,
జై హింద్!
మేరా భారత్ మహాన్!
***

DSCN6258.JPG


"అన్నా కు, అన్నా వెంట నడిచిన కోట్లాది బారతీయులకు నా అభినందనలు."
 అని అంటూ సత్యవతి  కొండవీటి గారు 
 కొండమల్లెల నడుమ అమర్చిన 
 అనారుపూల గుచ్చాన్ని పంపారు.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment