Nov 28, 2010

పత్రిక - పాఠక సంబంధాలు !

ఈ శీర్షిక ఎక్కడో విన్నట్టుగా మీకనిపిస్తే ,
ఖచ్చితంగా అది శ్రీ రమణ గారి ,
"గుత్తొంకాయ -మానవసంబంధాలు " అన్నమాట!


కొన్నేళ్ళుగా  ,  ఆపకుండా  ఆ శీర్షికతో కలిగిన పాఠక సంబంధం మహిమ అదీ !
రచయితకి  జై కొట్టి,  ఆ శీర్షికకు భూమిక అయిన "పత్రిక "విషయం లోకి వద్దాం.


ఎప్పటిలాగానే , దీపావళి మరియు జన్మదిన ప్రత్యేక సంచిక , పత్రిక ,మన మాసపత్రిక  , ను ఉత్సాహంగా తీసుకొని అలా తిరగేయగానే,
అట్ట మీది అరచేతిలో ప్రమిద  వత్తి రెపరెపలు తాకాయి!
కాదు, ఆరే దీపానికి వెలుగెక్కువని  అందుకే కాబోలు అంటారు!

ఒకటా రెండా , ఇన్ని సంచికలు" ఆర్ధిక భారం మోస్తూ , హార్ధికం గా " పాఠకులకు చేరాలని పడ్డ తాపత్రయాన్ని మొదటి పేజీలో వివరించారు.ఆని సాధకబాధకాలు ఓర్చి , ఒక మంచి కథల  పత్రికను అందిచాలని చేసిన ఈ ప్రయత్నం చివరకు ఏం మిగిల్చింది?
పత్రికొక్కటున్న పదివేల బలగమ్ము " అన్నారు కదా , మరి అంగబలం లేక ఆర్ధిక బలం చాలక పడ్డ ఇబ్బందులు వివరిస్తుంటే, చదివి బాధ పడకుండా ఉండగలమా?
"ఆ అంతేలే , ఇలాంటి పత్రికలన్నిటి అనుభవం ఆఖరికి ఇంతేలే !" అని ఓ నిట్టూర్పు వదిలి ఊరుకొందామా?
ఒక్కో మంచి పత్రిక ఉక్కిరిబిక్కిరయ్యి ఊపిరాడక కాలంలో కలిసిపోతుంటే, తెలుగువాళ్ళం మౌన ప్రేక్షకులమై సాగనంపక ఏమైనా చేయగలమా?
సీనియర్ పాత్రికేయులు శ్రీ ఐ వి వెంకటరావు గారి మానసపుత్రిక అయిన మన పత్రిక , శ్రీరమణ గారి సంపాదకత్వంలో ఎన్నెన్ని సాహిత్యవన్నెలు చిందించిందో!
***

తెలుగునాడి పత్రిక ను ఇకపై కొనసాగించలేమంటూ ఆ పత్రిక వ్యస్థాపక సంపాదకులు జంపాల గారు , రాసిన సంపాదకీయం ఇంకా మనసు లో మొదలుతూనే ఉంది. 
ఏ దేశమేగినా మన తెలుగు వాళ్ళం ఒక మంచి పత్రికను నిలబెట్టుకోలేని వాళ్ళమై పోయామే అని దిగులు  వేసింది. ఆ సంధర్భంలో , తెలుగునాడికి రాసిన ఇ .లేఖలోంచి కొన్ని వాక్యాలు. 
మళ్ళీ ఇక్కడ ప్రస్తావించ వలసి వస్తుందని అనుకోలేదు. తప్పలేదు.

***
నిన్ననే తెలుగు నాడి ఆఖరి సంచిక అందుకొన్నాను.
 ఇక పై పదమారా పలకరించే పత్రిక ఉండదని దిగులేసింది.
ప్రతి నెల క్రమం తప్పకుండా మా ఇంటికి వచ్చే ఆత్మీయ అతిథి... ఇక రాదు.
సంపదకీయం చదివేప్పుడల్లా  స్వయాన మీరే మాట్లాదుతున్నట్లుగా అనిపించేది.
సారి మీరు రాసిన సంపాదకీయం చదవ వలసిన రోజు వస్తుందనుకో లేదు.
మరొక పత్రిక రావాలంటూ మీరు చెసిన సూచన ఎంతో హృద్యంగా తోచింది.
నిజమే .
ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండాలి.
మరొక  చోట.
మరొక సారి.
(16-6-2009)

***
"పత్రిక "వారందరికీ అనేకానేక ధన్యవాదాలు. 

పత్రిక సంపాదకులు "ఇది విరామమే కానీ వీడ్కోలు కాకుండా ఉండేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని "అన్నందుకు మరొక్క మారు జేజేలు.

కొంత విరామం తరువాత, మళ్ళీ  మన "పత్రిక" మనలను పలకరిస్తుందనే ..

ఆశతో ఆకాంక్షతో..
మన పాఠక సంబంధాలను మరొక మారు పునర్నిర్వచించే  ప్రయత్నం చేద్దాం!
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 24, 2010

పల్లెమూలాలు

స్వేచ్ఛ, సమత, సౌభ్రాతృత్వాలతో నిండిన మానవ విలువలను ఆవిష్కరించ గలిగే సమర్థత 
సాహిత్యానికి ఉన్నది.
సమాజాంలో అంతర్లీనమై సమాజాన్ని ముందుకు నడిపించగల భావ పరిణితి,మేధో చింతన  ,మానసచేతన ,మానవ సంస్కారం ,సామాజి ఆర్ద్రత  రచయితకు ఉన్నప్పుడు ఆ రచన ఉన్నత విలువలతో మనకు అంది వస్తుంది.
ఆయా తరాలలో నవలారచయితల పరిమితులను అర్ధం చేసుకొంటూ , పరిణితిని స్వీకరించే ప్రయత్నం చేద్దాం.
అలనాటి అగ్రహార దురాచారాలను దురభ్యాసాలను ఎండకడుతూ కళ్ళు తెరిచిన రాజషేఖర చరిత్రము (1878) తెలుగు నవలకు నిజాయితీని నిబద్దతను  మార్గనిర్దేశం చేసింది.
"మాల పల్లి" లో మొదలైయిన సాంఘిక చైతన్యం కీలుబొమ్మలలో భావ చైతన్యం అయితే ,
“ప్రజల మనిషి " " జనపథం"లో “మోదుగుపూలు” పూయిస్తే , "మట్టిమనిషి " "ఆక్రందన" రేగడివిత్తులై" మొలకెత్తితే  "- చీకటిగదులలోని రాబందులను రామచిలకలు " నిలువరిస్తే నిలదీస్తే - 
"కొల్లాయి గట్టితేనేమి ?" నిబ్బరంగా " రథచక్రాల"పై నిలిచిఉంది తెలుగు నవల.
" చిల్లరదేవుళ్ల" కు వలసదేవర" చేసిన కాలరేఖలు " మన ముందు ఆవిష్కృతమయ్యాయి.
 "చివరి గుడిసె  లోని మూగవాని పిల్లనగ్రోవి " పాట ,"రాముండాడు రాజ్జివుండాది " "గద్దలాడండాయి "నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది.
"గంగు "  లిఖించిన " బతుకు పుస్తకం "పుటలు "పంచమం"అయి , అంటరానివసంతం" లా మోసులు వేస్తూనే ఉన్నది."కాడి" మోస్తూనే ఉన్నది.
భిన్న కాలాలు .భిన్న నేపథ్యాలు. భిన్న సంధర్భాలు. భిన్న దృక్పథాలు. భిన్న పార్ష్వాలు.  
కేవలం కాలక్షేపం కోసం కాకుండా కాలగమనాన్ని కాలానుగత గ్రామీణ జీవితాన్ని కలకాలం పదిలం చేసింది. చేస్తూనే ఉన్నది తెలుగు నవల.
గత శతబ్దం ఆరంభంలోనూ ,నడుమ వచ్చిన కొన్ని తెలుగు నవలలు  ...
 ఏ ఒక్క గ్రామానికో పరిమతమై ఫోకుండా, ఆయా రచయితల భావచైతన్య రూపాలుగా తాత్విక ప్రాతిపదికలుగా ఉన్నతప్రామాణికతను సాధించాయన్నది కాలం నిరూపించిన సత్యం.
అయితే , గత శతాబ్దాంతపు నవలలు ఈ శతాబ్దారంభ నవలలు కాలం పరీక్షలో నిగ్గు తేలవలసి ఉన్నది.
ఈ నాటికీ మనం గ్రామీణ వ్యవసాయం పైననే ఆధారపడి ఉండడం .. పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం.. విపరీతమైన జనాభా పెరుగుదల ..ఉపాధి అవకాశాల లేమి .. అనివార్యమైన పట్టణీకరణ ,క్రిక్కిరిసిన పట్టణ నగర జీవనం , ప్రపంచీకరణ... 
 ఈ నాటి నవలారచయితను మళ్ళీ గ్రామల వైపే నడిపిస్తున్నట్లుగా ఉన్నది.
మాయమవుతున్న మారుతున్న విలువల కోసం మూలాల కోసం .. పల్లెల్లో వెతుకులాడున్నాం.

సమాచార విప్లవం చేత గ్రామీణజీవితంలో పెనుమార్పులు వచ్చాయి. లోకజ్ఞానం పెరిగింది. ప్రశ్నించే హక్కును ప్రజలు వినియోగించుకొనే వీలు పెరుగుతోంది. ప్రజాస్వామ్య స్వభావ స్వరూపాలు అవగాహన అవుతున్నాయి.
మరో వైపు వస్తు సంస్కృతి గ్రామగ్రామాలకు విస్తరిచిపోయింది.వినిమయప్రపంచం శాసిస్తోన్న విలువలు జీవనవిధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి.వేగంగా మారిన మారుతోన్న జీవన చిత్రాన్ని ఈ తరం తెలుగు నవల అంతే ఒడుపుగా పట్టుకోవాల్సివుంది.
వస్తువులోనూ శిల్పంలోనూ భావపరిణితిలోనూ కళాత్మకతలోనూ సందిగ్దత కనబడుతోంది. బహుశా ఈ సందిగ్దత సమాజంలోని సందిగ్దతే కావచ్చు. 
వేగంగా నలువైపులా విస్తరిస్తోన్న మార్పును స్వీకరించ లేని అన్వయించుకోలేని రచయిత అశక్తతే కావచ్చు. 
స్వీయ శక్తి సామర్హ్ద్యాలపై  కాకుండా ,ఆనాటికి అంది వచ్చే అభిప్రాయలపై ఆధారపడే ఆశ్రయ ధోరణి  వలన కావచ్చు
.ఏమైనా ఈ తరం రచయిత విశాల దృక్పథాన్ని నిండిన మానవవిలువలను ఆవిష్కరించే కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది,
వ్యక్తి , కుటుంబం ,సమాజం ,రాజ్యం ,మతం ,తత్వం,చరిత్ర ,సంస్కృతి ,ఉద్యోగం ,ఉద్యమం .పెంపుముంపు ,కరువుకాటకం ,పంట పరిశ్రమ , 
అన్నిటికీ గ్రామీణజీవితమే నవలానేపథ్యమైంది.
ఆనాటి నుంచి ఈనాటి వరకు.
తెలుగువార్లో అణువణువునా నిక్షిప్తమై ఉన్న పల్లెమూలాల్ని కదిలించగల ఆత్మీయ పలకరింపులా మన ముందు ఉన్నాయి తెలుగు నవలలన్నీ .
తెలుగువారి వాడీ వేడి  ,వాడుక వేడుక ,మర్యాదమన్నన - గ్రామసీమ.
తెలుగు వారి ఎదసవ్వడి ,హృదయవేదన ,గుండె చప్పుడు -పల్లెపట్టు.
అప్పుడు ఇప్పుడు.
ఇది సత్యం!
అందుకు తెలుగు నవల ఒక సజీవ సాక్ష్యం!

( ప్రపంచ తెలుగు సమాఖ్య వారి ప్రత్యేక అనుబంధం కొరకు వ్రాసిన(28-10-4) వ్యాసం లోంచి మరి కొంత )

  

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 22, 2010

రచనాపరిమితి

ఏ రచనకైనా పరిమితులు ఉంటాయి.
గ్రామీణజీవిత చిత్రణలో తెలుగు అన్వలకు ఉన్న పరిమితులు అలాంటివే.
సమకాలీన పరిస్థితులకు లోబడిన రచయిత వ్యక్తిగతాభిప్రాయాల ప్రభావం రచనపై ఉండకపోదు.
అందులోనూ సృజనాత్మక రచనలలోని కళాత్మకవిలువలు రచయిత వ్యక్తిగత ప్రతిభపై ఆధారపడిఉంటాయి.
ఎంత పరిణితి చెందిన వారని భావించిన వారి కైనా ఎంతో కొంత పరిమితి తప్పదన్నది వాస్తవం.
అలాగే ,
జీవితానికి ఒక నిర్దిష్ట రూపం లేదు.
ఏ సిద్ధాంతాలలోనూ క్రోడీకరించలేము. ఏ సూత్రాలలోనూ బంధించలేము. ఏ చట్రాలలోనూ బిగించలేము.
కానీ, నవలకు రూపం ఉన్నది.ప్రారంభం ఉన్నది.ముగింపు ఉన్నది. ప్రామాణికత ఉన్నది. నిబద్దత ఉంది. నియమమూ ఉంది.


 స హితమై , సహితమైనదే సాహిత్యం అని అంటారు.
ఉన్నత మానవ విలువలను ఆవిష్కరిణ్చే అవకాశం, నవరసాలనూ కళాత్మకంగా వ్యక్తపరచగలిగే వీలు,విస్తృతి నవలలో ఉన్నది.
అయితే, తెలుగు నవలాసాహిత్యాన్ని కొలిచే కొలబద్ద ,తూచే తూనిక రాయి అయిన "రాజకీయ సత్యం" నవలను ఓ సృజనాత్మక రచనగా స్వీకరించడానికి ,ఓ రసాత్మక స్థాయికి పరిణితి చెందడానికి , పెద్ద అడ్డంకి.
సృజనాత్మకత కన్నా రాజకీయదృక్పథానికి ,సామాజిక ఆర్ద్రత కన్నా సిద్ధాంత ప్రాతిపదికకూ , ప్రాధాన్యతనిస్తూ ,
రాజకీయసత్యాన్నే  సామాజిక సత్యంగా పరిగణించే అవాంఛనీయ సాంప్రదాయం సాహితీ ప్రపంచాన్ని శాసిస్తున్నది.
కేవలం రాజకీయదృక్పథాల ప్రకటనగా నవలను మలిచే ప్రయత్నంలో రచయిత మునిగి పోతే , సృజనాత్మకతకు మూలమైన కవితాసత్యాలు ,భావచైతన్యానికి బాట వేసే హేతుబద్ద సత్యాలు ,మరుగున పడే  అవకాశాలు లేకపోలేదు.
ఇక, రసాత్మకతకు తావు లేని ఆ రచన రాజకీయ కరపత్రంలా దిగజారే ప్రమాదంలో కూడా అపుడప్పుడు పడకా పోలేదు.
ఏ రచనా రచయిత రచిండంతోనే పూర్తి కాదు. 
పాఠకుని అభిప్రాయంతో అది సంపూర్ణమవుతుంది.
అదుచేత, 
ఏ రచనైనా పాఠకునికి   ఓ పరిచయమూ ఓ ప్రారంభం మాత్రమే.
***

 (ప్రపంచ తెలుగు సమాఖ్య వారి ప్రత్యేక అనుబంధం కొరకు వ్రాసిన(28-10-4) వ్యాసం లోంచి ఇంకొంత )

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 19, 2010

తెలుగు నవల గుండె చప్పుడు

* గ్రామీణ జీవితం*
నూట పాతికేళ్ళ క్రితం సాంఘికప్రబంధంలా కళ్ళు తెరిచిన తెలుగు నవల ,
పల్లె సీమలో పుట్టి ,పంట చాళ్ళలో పెరిగి ,ఏటి గట్లపై నడిచి ,మడిచెక్క కై పోరాడి ,
పిడికెడు మట్టిని  గుండెకు అదుముకున్నది.

తెలుగు నవలానాయకుడు కాడిపట్టి పొలం దున్నుతూనే ఉన్నాడు.
తెలుగు నవలానాయిక నడుం బిగించి నాటు వేస్తూనే ఉన్నది.
తెలుగు నవలల పుటలు నారుమడి తడితో నిండిపోతూనే ఉన్నాయి.

గ్రామీణ జీవితమే ముఖ్యమైన తెలుగునవలల్లోని కథ, వస్తువు,వాతావరణం.

ధవళేశ్వరం అగ్రహారంలో పుట్టిన రాజశేఖరచరిత్రము (1878) నుండి  ముంపు గ్రామ
నేపధ్యమైన దృష్యాదృష్యం (2003) వరకు.
ఈ నడుమ గ్రామీణ జీవితంలో ని కాలానుగత పరిణామాలలోని వైవిధ్యం వలన తెలుగు నవలా వస్తువు విస్తృతమైంది.విపులమైంది.వివరమైంది.
ఆయా రచయితలకు వస్తువుతో ఉన్న సామీప్యత వలన అవగాహన వలన వారి రచనలలో పరిణితి ,గాఢత ,లోతు స్పష్టంగా ప్రకటితమైంది.
రచయితలకు గ్రామీణ జీవితంపై ఉన్న మమకారంతో పాటు ,
గ్రామం మిగిల్చిన తీపిజ్ఞాపకాలు ,చేదు అనుభవాలు వారి అనుభూతులను ఆలోచనలను మూర్తిమంతం చేసాయి.
తమ రచనలకు గ్రామీణ నేపధ్యాన్ని ఆయా రచయితలు ఎందుకు ఎంచుకొన్నారో , వారే చెప్పగలరు.
అయినా, గ్రామం వారిలో అంతర్భాగం కావడం వలనేమోనని అనిపించకపోదు.

ఇంతకూ-
గ్రామమంటే..?

ఊరా?అగ్రహారమా?పల్లా?పలా?పాలెమా? రేవా? దీవా? గూడెమా? గుట్టా?

గ్రామమంటే..?

పొలంపుట్రా? గొడ్డూగోదా?
కోనేటి మిట్టా? కాలువగట్టా?
పండిన పైరా? ఎండిన బోరా?
ఒంటిచెట్టు గుట్టా? యానాది మిట్టా?
దొరల గడీలా? చివరిగుడిసా?
శిఖంభూములా? ఖండిత ప్రాంతమా?

గ్రామమంటే..?

పాడిపంటలు,పండుగలూపబ్బాలు ,సంబరాలుసంతోషాలు ,పెళ్ళిళ్ళుపేరంటాలు ,ఆచారవ్యవహారాలు ,పంతాలుపట్టింపులు ,పెత్తనాలుదోపిడీలు,వర్ణాలు వర్గీకరణలూ,ముఠాలు ముట్టడులు, దౌర్జన్యాలు దౌష్ట్యాలు.

గ్రామమంటే..?

వైవిధ్యం.

ఆ వైవిధ్యం తోనే తెలుగు నవల నిండి ఉన్నది.
ఆ వైవిధ్యమే తెలుగు నవలకు నిండైన 
 రూపాన్ని ఇచ్చింది.
ఆ వైవిధాన్నే తెలుగునవల నిజాయితీగా ప్రకటించింది.

ప్రకటిస్తూనే ఉన్నది!

***

(ప్రపంచ తెలుగు సమాఖ్య వారి ప్రత్యేక అనుబంధం కొరకు వ్రాసిన(28-10-4) వ్యాసం లోంచి కొంత)



 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 14, 2010

బాల్యం గడప లో పగుళ్ళు

నవంబరు నెల వచ్చిందంటే చాలు .
పిల్లలు తయారు.
పిల్లల పండుగకు సిద్దమవుతూ.
బడిలోనో మరోచోటో పిల్లల కళానైపుణ్యాన్ని ప్రోత్సహించే  ఉద్దేశం తో అనేకానేక కార్యక్రమాలు నిర్వహింబడతాయి.
కొన్ని అధికారహోదాతో . మరికొన్ని స్వచ్చందంగా.
ఆ బాలల బాబాయి,జవహర్ లాల్ నెహ్రూ కు నివాళిగా.
వీటన్నిటికీ మాధ్యమంగా ఇప్పుడు మరొక వేదిక పిల్లలకు అనునిత్యం లభ్యమవుతూ ఉన్నది.
అది , మిరుమెట్లు గొలిపే టివి తెర.
అందులోను , ఇప్పుడు పండగలన్నీ మనం జరుపుకొనేది టివి తెరలపైననే కదా!
అందుకు పిల్లల పండగ మినహాయింపు కాబోదు.
" చిత్తి చిలకమ్మా.."
ఇంటికెవరైనా అతిథులు రాగానే మనమేం చేస్తాం?
 మన పిల్లలని పిలిచి వాళ్ళు నేర్చిన పద్యాన్నో పాటనో వినిపించిమంటాం.
పిల్లలు " చిత్తి చిలకమ్మా అమ్మ కొత్తిందా.." అంటూనో "తింకిల్ తింకిల్ లితిల్  స్తార్.."అంటూను ముద్దుముద్దుగా పలికే పలుకులకు మురిసి పోతాం. పుత్రోత్సాహంతో పొంగి పోతాం.
ఇక, బడిలో వేశాక వాళ్ళు రోజూ ఇంటికి తీసుకు వచ్చే ముచ్చట్లన్నీ మురిపాలుగా దిద్దుకొంటూ,మనం సంతోషించడమే కాక , బంధుమిత్రులనదరితో అపంచుకొని ,అమ్మనాన్నలుగా తరించిపోతుంటాం.
ఇంట్లో తాతయ్యలూ అమ్మమ్మలూ నాయనమ్మలూ ఉన్నట్లయితే ,ఇక ఆ సంబరం చెప్పక్కర లేదు.
ఇదుగోండి సరిగ్గా అక్కడే , మన పిల్లల కళాప్రదర్షన ప్రారంభమవుతుంది.
వారి కళను నలుగురి ముందు ప్రదర్షించాలనీ , వారి మెప్పును పొందాలని అనుకోవడం , ఎంత సహజంగా మొదలవుతుంది కదా!
అయితే, తమ పిల్లల ప్రదర్షనను లక్షలాదిమంది ప్రేక్షకులు చూడాలని ఏ అమ్మానాన్నలకు కోరిక
ఉండదు?  ఆ సహజమైన కోరికే , ఈ నాటి పిల్లల " రియాల్టీ షో " లకు మూలధనం !
***
బడిలోని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ,
 అప్పుడు వెన్ను తట్టిన ఉపాధ్యాయుని ప్రోత్సాహం, తరగతిలోని స్నేహితులతో పంచుకొన్న అమూల్యమైన అనుభవం అందరికీ ఓ చక్కటి జ్ఞాపకం.నిజానికి, ప్రత్యేక సంధర్భాలలో ,జాతీయ దినోత్సవాల్లో , పాఠశాల వార్షికోత్సవాల్లో ,పిల్లలి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్షించడం ఆనవాయితీ.
ఇలాంటి ప్రత్యేక సంధర్భాల కోసం ,పాఠాల మధ్యలో విరామాలు తీసుకొని ,వంతులు వేసుకొని మరీ  పంతుళ్ళు నేర్పే కొత్త కొత్త కార్యక్రమాలకోసం , అందరం ఎదురు చూస్తుంటాం.
లెక్కల మాష్టారు పద్యాలు పాడుతుంటే, తెలుగు టీచరు ఆంగ్లంలో డైలాగులు వల్లిస్తుంటే..నవ్వుతూ .సంతోషంగా సిద్దమవుతుంటాం.
దేశభక్తి, జాతీయభావన ,సుహృద్భావం, చైతన్యం, చదువు ,  మంచి నడవడిక ,క్రమశిక్షణ , సౌజన్యం, ప్రకృతి,మంచీ మర్యాదా..
ఇవన్నీ , అప్పటి పిల్లల సాంస్కృతిక కార్యక్రమమాలలోని ప్రధాన అంశాలు.
అందుకే తెలుగు బాలసాహిత్యం లోని ,గేయాలు ,పాటలు, నాటికలు ,ఏకపాత్రాభినయాలు ,బుర్రక్థలు,హరికథలు ..అన్నీ కూడా ,ఎంతో శ్రద్ధగా ,పిల్లల భావచైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినవి. 
ప్రతి మాట ,ఆలోచన , సన్నివేశం,సంభాషణ ...రచించడంలో వారు తీసుకొన్న జాగ్రత్త ,చూపిన మెళుకువలు , ఇప్పుడు తరిచి చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో!ఒక వ్యక్తినో రచననో పిల్లలకు పరిచయం చేసేటప్పుడు ,వారు పాటించిన ప్రమాణాలు మనకు విస్మయం కలిగిస్తాయి.
తెలుగువారి సంస్కృతీసాంప్రదాయాల్లో ప్రధాన భాగమై వెలుగొందిన బాలానందం నుంచి బాలల అకాడెమీ ,బాలభవన్ల వరకూ ,బాలల కళాప్రదర్షనకై ఉద్దేశించిన రచనల ఎంపికలో మెళుకువ వహించడం మనకు తెలుసు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, ఒక పింగాణీ కప్పునో సబ్బుపెట్టెనో బహుమతులుగా పొంది, చప్పట్లతో సంబరపడితూ ,ఇంటికి చేరే వాళ్ళం.ఇరుగుపొరుగుకు చూపించి  సంబరపడిపోయే వాళ్ళం కూడా.
ఉపాద్యాయుల సృజనాత్మకతకు ,కళాభిరుచికీ  ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఒక ప్రకటనలా ఉండేవి.
అమ్మానాన్నల ప్రమేయం దాదాపుగా లేనట్టే.  పిల్లల్ని చూసి మురిసిపోవడం తప్ప.
 ఇవన్నీ, మన బాల్యం గడప లోని పచ్చటి జ్ఞాపకాలు.
***

‘నిజ ప్రదర్షన "( రియాల్టీ షో )" లలోని , వాస్తవమేమిటో,
గత జూన్ నెల  "ఆట" వ్యవహారం, విడ మరిచి చెప్పిందికదా? ఆందోళనలో పడవేసిన అభం శుభం తెలియని బాలిక ఆత్మహత్యాయత్నం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తే,ఆంధ్రప్రదేశ్ బాల సంగం, ఐద్వా తదితర స్వచ్చందసంస్థలు తీవ్రంగా స్పందించి మానవహక్కుల కమిషన్ వద్దకు వ్యవహారాన్ని చేర్చాయి. అనేక మంది తల్లిడండ్రులు వారితో పాటు నడిచారు.
జస్టిస్ సుదర్షన్ రెడ్డిగారు అంతే తీవ్రంగా ప్రతిస్పందిచారు. ఆ రియాల్టీ షో ను వెంటనే ఆపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.  .
కాగా,
ఆ సంధర్భంలో జస్టిస్ సుదర్షన్ రెడ్డిగారు ఇలా వ్యాఖ్యానించారు,"
 "పిల్లల ఆరోగ్యాన్ని చదువును ఇలాంటి ప్రదర్షనలు పాడుచేస్తున్నాయి. అమ్మానాన్నలు ఇలాంటి కార్యక్రమాలకు పిల్లలు పంపడానికి వ్యతిరేకించాలి . సినిమాపాటలకు పిల్లలు చేస్తున్న డాన్సులు అశ్లీల భంగిమలతో అభ్యంతరకరంగా ఉన్నాయి."
కొద్దిమంది అమ్మానాన్నలే ఆ ఆటలను వెనకేసుకొచ్చారు.కాగా, న్యాయపరమైన పోరాటం ఇప్పుడు హైకోర్టు వరకు వచ్చింది.
నిజమే .ఈ  నిజ ప్రదర్షనలలో అందులో పాల్గొన్న వారికి , వారిలోని నైపుణ్యాన్ని లక్షలాది మంది ప్రేక్షల ముందు ప్రదర్షించే వేదికలను అందిస్తాయి. కీర్తినీ,డబ్బును , ప్రతిష్టాత్మకమైన సంస్థలతో పని చేసే అవకాశాన్ని, నిపుణులతో శిక్షణలో మెళుకువలు నేర్చుకొనే అవకాశాన్ని , ప్రముఖవ్యక్తులతో సన్నిహితంగా మెలగగలిగే అవకాశాన్ని ఇస్తాయి. నలుగురి దృష్టిలోకి రావడం వలన , సినిమా ,టివి తదితర రంగాలలోకి ప్రవేశించదలచిన వారికి , ఆ దరిమిలా ఆయా రంగాలనే వృత్తిగా మలుకోదలిచిన వారికీ, వాకిళ్ళు తెరుస్తాయి.
ప్రదర్షనకారులలో విశ్వాసం ఇనుమడించడం, నలుగురితో మెలగడం ,తమ కళను మెరుగులు దిద్దుకోగలగడం ,ప్రదర్షనలో మెళుకువలు నేర్చుకోవడం , సమయ పాలన ,సరికొత్త పరిచయాలు, స్నేహాలు ..ఇవన్నీ సుగుణాలుగా చెప్పుకొంటే,
మరోవైపు అలాంటి కార్యక్రమాలు మితిమీరి... విచ్చలవిడిగా మారి...జుగుప్సాకరంగా తయారయ్యి...అందరికీ అభ్యంతరకరమై కూర్చున్నాయి!
తిరస్కృతి వికృతి
నిజ ప్రదర్షనలలో అభినయిస్తున్న పిల్లలకు నిజానికి ,  ఆయా పాటల్లోని శృంగారం కానీ  అశ్లీలత గానీ ,ఆయా మాటలల అర్ధం పర్ధం గానీ ,లోతుపాతులు గానీ తెలియదు. తెలిసినట్లు నటించాల్సి వస్తుంది. నటనలోనే జీవించాల్సి వస్తుంది. నిజమేమో అన్నంత సహజంగా.
వారితో జంటగా నర్తించే కళాకారులు ,మాస్టర్లు...  పెద్దవాళ్ళు కావడం , వీరికి ఆయా పాటల లోగుట్టులన్నీ తెలవడం మనం గుర్తించాలి. వారు తెలిసి చేస్తున్నారు. పిల్లలకు తెలియక చేస్తున్నారు.వారి అమ్మానాన్నలకు తెలిసి ఊరకుంటున్నారు.
ఎంపిక చేసుకొనే పాట ,  నృత్యాన్ని మలిచే తీరు ,వేసుకొనే బట్టలు ,చేసుకొనే అలంకరణ, చేయ వలసిన వేదిక ... వీటన్నిటి ఎంపికలోను పిల్లల ప్రమేయం ఏమీ లేదు. వాటి నిర్ణయాలు ఆయా పెద్దలు చేస్తారు.
ఇక ,ఎంపిక చేసిన పిల్లలను గుంపుగా ఒక చోట చేర్చి ,కలివిడిగానో విడివిడిగానో .ఆయా అవసరాల్ని బట్టి ,ప్రదర్షనకు ముందు ప్రత్యేక శిక్షణను ఇస్తారు. ఆ శిక్షణా వ్యవహారాన్ని వివరిస్తూ ,అచ్యుత్ రావు గారు,ఆంధ్రప్రదేశ్ బాలసంఘం ,అధ్యక్షులు, ఇలా అన్నారు,పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను ఎక్కడపడితే అక్కడ అభ్యంతరకరీతిలో తాకడం,అశ్లీల భంగిమలను అభినయాన్ని నేర్పడం , పెద్దల మధ్య  దొర్లే "పెద్దల మాటల"కు పిల్లలు శ్రోతలు కావడం, గెలవడంకోసం విపరీతమైన వత్తిడికి గురిచేయడం ..వంటివి తీవ్ర అభ్యంతరకరం."
నిజానికి, ఈ పిల్లలకు తమ ప్రదర్షనను ఎంతమంది చూస్తున్నరో ,దానికి స్పందన ఏమిటో ,ఒక వాస్తవ అవగాహన ఉండదు. అదంతా కాల్పనిక గణాంకం.  పిల్లల అంచనాకు అందనిది.
సినిమా పాటల అశ్లీలతను అందరం గర్హించాం .అయితే, అంతే అభ్యంతరకరమైనది, సంస్కృతి పేరుతో జానపదం పేరుతో పిల్లలకు నేర్పుతున్న , పూనకాలు,చేతబళ్ళు ,వీరంగాలు ,మూఢాచారాలు, జానపద శృంగారాలు!
ఇది తెరవెనుక భాగోతం కాగా, తెరకెక్కేది
 పిల్లల శిక్షణ ముగిసి  వేదికపై ప్రదర్షనకు వచ్చినపుడు ,కొందరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే
వారి వ్యాఖ్యానాలలోని దురుసుతనం ఒక్కో మారు పిల్లలు తట్టుకొనేట్టుగా ఉండవు.  ఓటమినీ ,తిరస్కృతిని తట్టుకోనేంత శక్తి , విమర్షలోని తీవ్రతను సంభాళించుకొనే పరిణితీ ,మంచీచెడును విశ్లేషించుకొనే వివేచన పిల్లలకు అప్పుడె ఎలా వస్తుంది? తిరస్కారం వారిని నిరాశకు గురి చేస్తుంది.ఆ దరిమిలా ,కుంగుబాటు ( డిప్రెషన్) కు .
ఇక, ఆకస్మికంగా వచ్చే కీర్తి ,తద్వారా లభించే ప్రతిష్ట ..పిల్లలను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.అవి , ఒక్కసారిగా తొలగిపోయినప్పుడు లేదా చేజారినప్పుడు , ఆ తిరస్కృతిని తట్టుకోగల ..పరిణితి వారికి వుండదు.
దానికి తోడు, పెద్దల నుంచి నిరసన, వత్తిడి,క్రమశిక్షణాచర్యలు(పనిష్మెంట్) తోడయితే , తీవ్రమైన నిరాశానిస్పృహలు తప్పవు .ఆత్మహత్యాయత్నాలు తప్పవు.అందుకు సజీవ ఉదాహరణ మన తెలుగునాటే ఉండడం మనం సిగ్గు పడాలి.
ఇంతా చేసి వీరంతా పట్టుమని పదేళ్ళయినా నిండని పసిబిడ్డలు!
కెమేరా ముందు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోనే ,బాల కళాకారులు ఒక పరిమితమైన అసహజ ప్రవర్తనను నేర్వాల్సి ఉంటుంది. రాను రాను ఈ అసహజప్రవర్తనే వారి సహజప్రవర్తన అయి పోతుంది
.ఈ కార్యక్రమాల అనంతరం ,తిరిగి తమ ఈడు పిల్లలతొ వారు మెలగ వలసి వచ్చినప్పుడు ,వీరి ప్రవర్తన వింత గానే ఉంటుంది.
కాగా , వారితో పాటే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇతర పిల్లలతో వారి ప్రవర్తన మరింత తీవ్రం .
 స్నేహసంబంధాల మాటే లేదు. పైనుంచి , పోటీ దార్లుగా, కక్షదార్లుగా ఎదురుబొదురుగా నిలబెడతారు.ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకోనేట్లు  , ఆ ద్వేషాన్ని కోపాన్ని ప్రదర్షించేట్టు .. రెచ్చకొడతారు. 
తమ చేతిలోనిది దోచుకొనే దుర్మార్గుల్లా భావించడానికి తప్ప , వారిలోని నైపుణ్యాన్ని మెచ్చుకొనే సుహృద్భావనకు అవకాశమే లేదు.
పగ, కక్ష,ద్వేషం ,పోటీ,గెలుపుకీ కుట్ర,కుతంత్రం ,హేళన చేయడం,కించపరచడం..
ఇవన్నీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేర్పవలసిన గుణాలు కానే కావు !
సభ్యసాజికులకు అబ్బవలసిన లక్షణాలూ కావు!

అమ్మా నాన్నలు :
 తమ పిల్లలను ఇలాంటి నిజ ప్రదర్షనలలో నిలబెట్టడానికి ,ఎవరికి వారికో కారణం ఉంటుందేమో కానీ, ప్రధానంగా కనబడెది , గెలుచుకొనే డబ్బు ,పేరుప్రతిష్ట,ఆ పై అందే అవకాశాలు.
వారి పిల్లల ప్రతిభపై వారికి ఉన్న మితి మీరిన అంచనాలు , బహుమతి గెలుపుకై విపరీతమైన నమ్మకాన్ని పెంచుతాయి.ఆశలను పెంచుకొంటున్నారు.
తమ బిడ్డల సామర్ధ్యాన్ని ,నైపుణ్యాన్ని వాస్తవాన్ని మించి ఊహిస్తూ ఉన్న వారి అంచనాలను చేరుకోనప్పుడు , వారి నిరాశ ఆగ్రహమవ్వడం ఖాయం!
ఇక, వారు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం , అలా తీవ్రమైన శారీరక ,మానసిక వత్తిళ్ళకు పిల్లలను గురిచేయడం తప్పదు.
"నీపై ఎన్ని ఆశలు పెట్టుకొన్నాను. అన్నీ మట్టి మట్టిపాలు చేశావ్!" లాంటి శాపనార్ధాల ప్రభావం ఒక బిడ్డ జీవిత కాలం!
కాగా, నిజప్రదర్షనల నిర్వాహకులు ఇప్పిణ్చే ప్రత్యేక శిక్షల కాలం బిడ్డలను తల్లిదడ్రుల నుణ్చి, సహోదరులనుంచి ,తోటి స్నేహితూల నుంచి వారిని వేరు చేస్తుంది.  
వంటరితనం ,శిక్షణ వత్తిడి  ఖచ్చితంగా వారిపై ప్రభావం చూపుతుంది. మానవసంబంధాలలోని మార్దవాన్ని అవగతం చేసుకోవ్ల్సిన  బాల్యం , అయోమయంలో పడుతుంది
.పెద్దల్లా అభినయిస్తూ తమని తాము పెద్దల్లా భావించడం మొదలు పెడతారనడంలో సందేహం లేదు.

పిల్లలను ఎవరు ఎక్కడ తాకినా  తప్పులేదు.పిల్లలముందు ఎలాంటి మాటలు మాట్లాడినా తప్పుకాదు . అన్నది ఈ  శిక్షణ,ప్రదర్షన సర్వసాధారణ సత్యాలుగా ద లక్షలాది మంది ప్రేక్షకుల ముందు నిలుపుతున్నాయి. 
ఆ ప్రేక్షకులలో బాల ప్రేక్షకులు ఉన్నారు!

ఇంట్లో కూర్చుని ఈ నిజప్రదర్షనలు తిలకిస్తున్న అమ్మనాన్నలు అలవోకగా అనేమాట్లు ఇలా ఉంటాయి," నువ్వూ ఉన్నావ్ ఎందుకు ? చూడు ! ఆ పిల్లల్ని చూశైనా నేర్చుకో !"
వారి బిడ్డకు ఆ కళపై ఆసక్తి ఉన్నదో లేదో ,వారు అరక్షణం కూడా ఆలోచించరు. "ప్రముఖపిల్లల" అమ్మానాన్నలు గా ఉండాలన్నది వారి బలమైన కోరిక !
అనుభవం కొశం తమ పిల్లల్ని ఇలాంటి కార్యక్రమాలకు పంపే అమ్మానాన్నలు ఆలోచించాలి , వారు తమ పిల్లలకు ఎలాంటి అనుభవం ఇస్తున్నారు?
సహజంగా వికసించినవలసిన బాల్యాన్ని అయోమయంలోకి నెట్టేసే ,ఇలాంటి అనుభవం పిల్లలకు ఇవ్వకపోతేనే మంచిది.

పిల్లలే ఎందుకు?

ఇవ్వాల్టి వినిమయ ప్రపంచం గురి ,లక్ష్యం .. పిల్లలే!
వస్తువు కొనుగోలు పై నిర్ణయాన్ని ప్రభావితం చేయగల శక్తి ఈనాడు పిల్లలకే ఉన్నది. గారాలు పోయో ,ముద్దారగ అడిగో ..అలా కుదరక పోతే , ఏడ్చి ,అలిగి ,గొడవపెట్టో .. అనుకున్నది సాధించే కళ పిల్లలకు ఉంటుంది.
పరిమిత కుటుంబాలలో పిల్లల మాటే చెల్లుబాటు కావడం మనమెరిగిందే. 
ఇవ్వాళ  కాకపోతే రేపు వారనుకొన్నది కొనుగోలు చేయించడం పిల్లలకు వెన్నతో పెట్టిన విద్య.
కొనవలసిన వస్తువుల జాబితాలను పిల్లలు తమ ఇంటి టివి తెర మీద నుంచే  ,తయారు చేయడం మొదలెడతారు. బడిలోనూ ఇతరత్రా ,ఒకరినుంచి ఒకరికి ,ఈ వార్త చేరుతుంది.
 ఒక బ్రాండ్ నిలదొక్కుకోవాంటె పిల్లలో ప్రాచారం కావడం కన్నా బ్రహ్మాండమైన మార్గం మరోటి లేదు. 
ఎందుకంటే, ఈ పిల్లలే పెరిగి పెద్దయ్యి ఆ బ్రాండ్ కు విధేయ వినియోగదారులవుతారు. దానాదీనా, నేటి పిల్లలే భావి వినియోగదారులు!
అందుకై, పిల్లలకు "రోల్ మోడల్స్"(మాదిరి నమూనాలు" తయారు చేయడం, బాల తారలను ( చైల్డ్ సెలబ్రిటీ) లను తయారు చేయడం, వారిని ఆపై ఆయా వస్తువులకు "బ్రాండ్ అంబాస్సడర్లుగా " మలచడం ,వారు బాల ప్రేక్షకుల ను ప్రభావితం చేయడం , ఇదంతా సహజ పరిణామం.
నిజానికి ఇవన్నీ చెప్పడానికి మనం మార్కెట్ రంగ నిపుణులం కానక్కర లేదు. 
కాస్త కళ్ళు తెరిచి చూస్తే చాలు !

టిఆర్పి రేటింగ్ ల కన్నా   బాల్యం  ఖరీదైనదని టివీ ఛానెళ్ళ వారు ,
పిల్లలు తెచ్చే డబ్బు ,కీర్తి కన్నా వారికి తాము పణ్చే ఆప్యతానురాగాలే తమ మాన్వసంబంధానికి మూలమన్న విచక్షణ కలిగిన అమ్మానాన్నలు ,
 ఎక్కడ పసితనం పదిలంగా ఉంటుందో అక్కడ మానవ సంస్కారం పచ్చగా ఉంటుందని విశ్వసించే సామాజికులూ..
ఉంటే తప్ప ..
ఇలాంటి వికృతాలకు తెర పడవ్ !
లేకుంటే, మన పిల్లలు గెలిచినా ఓడినా ,  
మనం మాత్రం దారుణం గా ఓడుతాం!
సాంస్కృతిక కార్యక్రమాల పేరిట మన పిల్లలపై ఇంత బాహాటం గా  జరిగుతోన్న  అత్యాచారాన్ని ,హింసను తొలగించే ఒక కార్యాచరణ ప్రణాళికను పాటించకుండా ,
పిల్లలపండుగను ఎలా జరుపుకుంటాం?
అది అర్ధ రహితం !
(ఈరోజు సాక్షి ఆదివారం అనుబంధం "ఫన్ డే " లో ప్రత్యేక వ్యాసం" శీర్షిక న ప్రచురితం.)

All rights @ writer. Title,labels, postings and related copyright reserved

Nov 10, 2010

ఎక్కడ పిల్లలు గౌరవించబడతారో ..!

మీరు సరిగ్గానే చదివారండి.
అది  పిల్లల గారాబం కాదు,  పిల్లల గౌరవమే !


పెద్దలు మన్నించండి !
ముందుగా,
పిల్లలను గౌరవించండి !


అదేంటి ... మనం ఏం నేర్చాం? ఏం నేర్పుతాం?
పెద్దల్ని కదా గౌరవించాలి?
తప్పకుండా.
అలాగే గౌరవిద్దాం.
అంత కన్నా ముందుగా ,  పిల్లల్ని గౌరవిద్దాం.

పిల్లల్ని ప్రేమించాలి గానీ, గౌరవించడం ఏమిటీ.. మరీ ఈవిడ విడ్డూరంగా మాట్లాడుతోంది...
అని ఏ మూలైనా మీలో ఒక సందేహం మెదిలిందా?
ఒక్క నిమిషం.

మీ టివి తెరల మీది రియాల్టీ షో లనో , ఇప్పుడు సందుసందునా జరిగే పిల్లలపండుగ ,చాచాజీ పుట్టిన్రోజు వేడుకల్లో నో , పిల్లలు వేదికల మీదకు ప్రదర్షనలివ్వడానికో , బహుమతులు అందుకోవడానికో వెళుతుంటారు ..కదా ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి.
ఏమేం గుర్తొచ్చాయి...?
వేదిక మీద ఒకరో పలువురో పెద్దలు నిలబడి ఉంటారు. పిల్లల పేరు పిలవగానే పరిగెడుతూ ..మెట్లెక్కి .. వెలుగులో నడుస్తూ .. ఉత్సాహాన్ని అదుపుచేసుకొంటూ .. చకచకా వెళ్ళి, ఆ ముఖ్య అతిథి లేదా అతిథుల ముందు నిలబడ్తారు. బహుమతి అందుకొనే ముందో తరువాతో ...
పిల్లలు చటుక్కున వంగి వారి పాదాలను తమ మునివేళ్ళ తో తాకుతారు.
అబ్బ !
చూడండి... !
పిల్లల్ని అనవసరంగా ఆడి పోసుకొంటాం .కానీ ,వారికి పెద్దలంటే ఎంత గౌరవమో!
అదేం కాదు. వాళ్ళమ్మో నాన్నో టీచరో చెప్పి పంపుంటారు.. అని అంటారా?
చెప్పి పంపినా , నడుం, తల వంచి.... పాదాలంటి ప్రణమిల్లారంటే, ఆ పిల్లల్లో నూ ఆ సంస్కారభావం ఉన్నట్లే కదా!
సరే మంచిది.
 ఇక, మన ముఖ్యాతిథి/ థులు  ఏం చేస్తారు ?ఎలా స్పందిస్తారు?ఎలా పిల్లల ప్రణామాలకు బదులిస్తారు? కనీసం అభినందనో ఆశీర్వచనమో పలకనైనా పలుకుతారా?  తలెత్తి , ధిలాసాగా , విగ్రహాల్లా నిలబడి ..కాళ్ళు మొక్కించుకొంటారా?
అదండీ సంగతి!
 ఇంతకీ ఆ పిల్లలు ప్రకటిస్తున్న గౌరవం దేనికి ? కళకా? కళాకారుడికా? 

ఎందుకు కాళ్ళు మొక్కుతున్నారో వారికి తెలుసా? ఆ కళాకారుడో మరో ముఖ్యమైన వ్యక్తో , నిజంగా పిల్లలకు ఆదర్షప్రాయులు కాదగ్గవారేనా? అయితే , ఎలాంటి ఆదర్షం ? సభ్య సామాజికులకు గాని, జన సామాన్యానికి కానీ,వారి ఆలోచన  మార్గదర్షకత్వం అయ్యిందా? ఏ కొందరిచేతనో  లేదా అందరిచేతనో ఆచరించబడిందా?
అందులోనూ, ఇవ్వాళ్టి వేదికల మీది ముఖ్య అతిథుల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకొంటే అంత మంచిది కదా?

సూటిగా చెప్పుకోవాలంటే,
ఆ పెద్దల తమను తాము అతీంద్రులమని భావించుకోవడానికా? లోలోన  అంతో ఇంతో ఉన్న అహం మరో బారోమీటరు పొడవు పెరగడానికా?  
నాకయితే అర్ధం కాలేదు సుమండీ!

నయానో భయానో పిల్లలు పెద్దలకు తమ గౌరవం పాదాలంటి మరీ ప్రకటిస్తే ,  ఆయా పెద్దలా మర్యాద నిలబెట్టుకోగలుగుతున్నారా?
నిమ్మకు నీరెత్తినట్టు నిలబడి మొక్కించుకొనే వారు ఒకరైతే , "మొక్కడం వారి ధర్మం ! "అన్నట్టు వ్యవహరించే వారు ఇంకొందరు ! "మొక్కితే ఎంత మొక్కకుంటే ఎంత" అన్నట్టు ఉదాసీనంగా ఉండేవారు కొందరు.
మర్యాదకైనా పిల్లలను వారించేవారు కనబడరు కదా?
ఒకరిని చూసి మరొకరు .. ఎంత మొక్కించుకుంటే ,అంత పెద్ద మాష్టర్ ! అదన్న మాట !
ఇక టివీ తెరలా టీరే వేరు!
ఛానెళ్ళు వేరయినా  కార్యకలాపాలు ఒకటే!  పిల్లల్ని ఆ పెద్దలు చూసే తీరు ఒకటే! ముందేమొ మార్కులతో పాటు వంకరటింకర మాటలు , ఆపై సవినయ సాష్టాంగ స్వీకరణలు.అదీ సరిగ్గా ,బహుమతుల అనౌన్స్మెంట్ కు అటూ ఇటుగా!
ఆ వత్తిడి .ఆ హంగామాల్లో నలుగు తోన్న ఆ పిల్లల సంగతి ఏం చెప్పినా తక్కువే!
పాపమా పిల్లలు ఏం చేయగలరు, టపామని పాదాలంటక !
ఇప్పుడా సంస్కృతి  అన్ని వేదికలకూ పాకడమే విషాదం.

పిల్లలంటే వీసమెత్తు గౌరవం లేని పెద్దల పాదాలంటి ..
“మనసా వాచా కర్మణా ... నీ దాసానుదాసుండ “అనో ..
బాంచెన్ ..నీ కాల్మొక్తా.”. అనో ... స్పురించే...
ఒక తిరోగమన సంస్కృతికి మనల్ని తీసుకెళ్ళి నిలబెడుతుంది... ఇలాంటి  గౌరవరహితమైన గౌరవప్రకటన !

మనిషి మీద గౌరవం ప్రకటించడానికి గౌరవప్రదమైన మార్గాలెన్నో ఉన్నాయి !
ఆ వ్యక్తి ని స్పూర్థిగా , ప్రేరణగా ,మార్గదర్షకం గా , ఆదర్షంగా స్వీకరించడంకన్నా.. ఆ వ్యక్తి ఆలోచనల్లో ఏ ఒక్క దానినో ఆచరిచడం కన్నా మనం ప్రకటించే గౌరవం ఏముంటుంది ?

వ్యక్తి పూజ కు రోజులు చెల్లాయ్!
ఏనాడో !
ఆయా రంగాలలో ఆ పిల్లల ప్రతిభను ప్రోత్సహించడానికి నిర్మించిన వేదికలపై ,గౌరవం అందుకోవలసినది ఎవరంటారు ? 
ఒక చల్లని మాటతో వారిని పలకరించినా ,ఒక చిరునవ్వును వారిపై చిలకరించినా ..ఆ పిల్లలెంత సంబరపడతారో ! 


అందుకే ,


పిల్లల్ని గౌరవించండి!
వారి అభిప్రాయలనూ.వారి అనుభూతులనూ. వారి అవసరాలను.వారి అభిమానాలను.


పిల్లలను గౌరవిస్తూనే ఉండండి.

పిల్లల  సృజనను, ప్రతిభను ,కళను గౌరవించక పోతే ,
మనల్ని మనం అవమానించుకొన్నట్టే కదా?

ఎందుకంటే, 
ఎక్కడ పిల్లలు గౌరవించబడతారో , అక్కడ మానవ సంస్కారం మూర్తివంతవుతుంది !
పిల్లల పండుగ సార్ధకమవుతుంది!

***

ఈ మారు మొక్కేది ఎందుకో ...
తెలుసుకొని మొక్కండి!

మొక్కించే ముందు ..
ఓ మారు ఆలోచించి మొక్కించండి!!

మొక్కించుకొనేది ఎందుకో ...
తెలుసుకొని మరీ మొక్కించుకోండి !!!

****
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 6, 2010

కథాకమానీషు !

పిల్లలకు కథలంటే ఎంతిష్టమో !
ఇక, వారినే కథలు చెప్పమన్నామంటే , ఇట్టే అల్లేసి ,చక చక గబగబ చెప్పేయగలరు. అంత దాకా ఎందుకు? ఇవ్వాళ బళ్ళో ఏం జరిగిందో అడిగి చూడడి. 
ఎన్ని కథలు చెపుతారో!

ఇప్పుడు చెప్పబోయేది పిల్లలు కథలు రాయడం గురించి.
 అందునా ,పిల్లల పండుగ  సంధర్భంగా పిల్లలందరినీ ఒకచోట చేర్చి, కథలు రాయమన్నామే ..ఆ విశేషాల గురించి!

పిల్లలకు హాస్యం ,సాహసం  ,అద్భుతం   ..అంటే ఇష్టం కదా .అందుకే ఆ రోజు ఇచ్చిన మూడు "కథన సంధర్భాలను" ఇలా ఇచ్చింది.

అవేమిటంటే,

1. మన వూరి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద, ఒక ఆదిమ మానవుడు   , ఒక రాక్ స్టార్
ఎదురు పడ్డారు. ఇద్దరూ ,ఒకే లాంటి  దుస్తులు ,అలంకరణ చేసుకొని ఉన్నారు. వారిద్దరి మధ్యన ఎలాంటి  సరదా సంఘటన జరిగి ఉంటుందో ..ఊహించి  రాయడి.
2. మీరొక  అంతరిస్తున్న జీవరాశికి చెందిన ఆఖరి కుటుంబ సభ్యుడు . మీరేం చేసి మీ జాతిని/సమూహాన్ని అంతరించి పోకుండా కాపాడుతారో రాయండి.
3. మీరు అనుకోకుండా తప్పి పోయారు. ఒక ఏకాంత ప్రదేశం చేరుకొన్నారు. అప్పుడు మీ వద్ద కేవలం మూడు వస్తువులు ఉన్నాయి. వాటిని వినియోగించి , మీవారిని మీరు ఎలా కలుసుకొంటారో ..కథలా రాయండి.

మీ ఊహ నిజమేనండి.
పిల్లల్లో ఎక్కువమంది సరదాకథనే రాశారు.
ఇకపై మీరు , వారి కథలన్నీ వరుసగా చదవొచ్చు. ఆ కథలన్నీ , పైన చెప్పిన ఏదో ఒక కథన సందర్భానికి చెందివన్న మాట!
బాల రచయితలకు బోలెడు శుభాకాంక్షలు.
మీ అభిప్రాయాలు ఆ చిన్నికలాలకు మార్గదర్శకం కాగలవు.
కనుక, మీ సూచనలను వారందరి తరుపునా ఆహ్వానిస్తున్నాం.

సృజనాత్మకతకు భాష ఒక మాధ్యమమే కానీ, అడ్డంకి కాదు.కథ కథనానికి అవసరమైన భాషను పదాలను తనే వెతుక్కుంటుంది... కథకుడికి తెలిసిన భాషాప్రపంచంలో!
తెలుగులో కూడా రాయమని ,ఎంతగా ప్రోత్సహించినప్పటికీ పిల్లలంతా ఆంగ్ల భాషలోనే రాశారు. ఒకే ఒక్క రచన తెలుగులో .
పిల్లలకు వారి తెలుగు పట్ల బోలెడంత అపనమ్మకం.
బాగా రాదని. తెలియదని. పదాలు లేవనీ. తప్పులు పోతాయని.


వాళ్ళు మనం ఎలా వీటిని పిల్లలకు అబ్బేలా చేయాలో, మనకు హోం వర్క్ ఇచ్చేశారు. ఆ పనిలో మనం ఉందాం. 


ఈ లోగా , వాళ్ళకు వచ్చిన మాటల్లో ,
వారు రాసినవి రాసినట్టుగా మీ ముందుంచుతున్నాము.
దాదాపుగా  పిల్లలందరికీ ఇది తొలి ప్రయత్నం.
చదవండి మరి!

***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 4, 2010

టపటపల టపాకాయ!

టపాకాయలను  వద్దనకుండా ,
కాలుష్యరహితంగా దీపావళి పండుగను  
ఎలా గడపవచ్చునో మీకు ఏమైనా తెలుసా?
కొంత కొత్తగా ఆలోచించి చూడండి!


మొన్న ప్రభవలో ,
పిల్లలు ఎన్నెన్ని  రకాల ఉపాయాలను చెప్పారో!




ఇక, శ్రీహిత్  చెప్పాడు.


వాళ్ళమ్మతో బాటు ఈ మధ్య వానలు పడ్డప్పుడు మొక్కలు నాటాడట.
నెల్లూరు బుజ్జి న్యూటన్ గారు వీరే !
 అప్పుడు చూశాడట, 
కొన్ని నీళ్ళు పడగానే ,టప టప లాడిన కనకాంబరం విత్తనాలను.
అలా టప టప లాడడానికి గల జీవ రహస్యమేమిటో కనుక్కుని, దానిని అన్వయించి ,తాను కొత్తరకం టపాకాయలు తయారు చేస్తాడట. అప్పుడు మనం నిప్పుతో కాకుండా నీళ్ళతో టపా కాయలు "కాల్చుకోవచ్చ"ట!
నిప్పు పుట్టించే కాలుష్యమూ ఉండబోదు!
టపాకాయలదీపావళే   దీపావళి  !


ఇక, ప్రభవలో చేరిన పిన్నపెద్దలు అందరూ అతనికి జేజే లు చెప్పి, వెంటనే టెక్నో స్కూల్ బయటపడి , జీవసాంకేతిక నిపుణుడై ,ఆ కనకాంబరం టపాకాయలను వెంటనే   కనుక్కోమని , ఆపై  పేటేంట్ కూడా తీసేసుకోమనీ ,
 మేమందరమూ ఆ టపాకాయలనే  ప్రతి  దీపావళికి టపటప లాడిస్తామని చెప్పేసాం!


అదుగోండి అలాంటి , అనేక విశేషాలతో, ప్రభవ లో పిల్లల పండుగ  జరింది. 
మరి మీరూ చూడండి.
*
మీకు
మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలతో ..
ప్రభవ 
లోని 
పిన్నాపెద్దా!

Prabhava has sent you a link to a blog: 
Blog: Prabhava ప్రభవ
http://prabhavabooks.blogspot.com/

***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.