Sep 22, 2010

సిరా సేజ్జెం

పొలమంతా సిరా చల్లి, అక్షరాలు నాటేసి, కథన సేద్యం చేస్తే ... అక్కడ మొలకెత్తేది ఆనందమా?ఆవేదనా? ఆందోళనా? ఆక్రందనా?
ఖచ్చితంగా అవి అన్నీ కలగలసిన.. మొలకలపల్లి గారి ” సేజ్జెగాడు” కథాసంకలనం అయి ఉంటుంది !
అవునండి.
 తెలుగునాట ప్రత్తిరైతులు పురుగుమందును కడుపులో దాచుకొని మన ఓటమిని తమదిగా దిగమింగిన విషాద నేపధ్యంలో , మొలకలపల్లి గారు నవలీకరించిన ఆ”ఆక్రందన” మనలను ఇంకా వెన్నాడుతూనే ఉండగా, 
ఇదుగో ఇప్పుడు పదిహేడు కథల రూపంలో రైతుల జీవితశకలాలను “సేజ్జెగాడు”వెంట తీసుకొచ్చింది.
బతక లేక బడుగు రైతు ..అనుకునే ఈ రోజుల్లో..ఈ కథలు మనకు మరో మారు బతుకు తీపిని పరిచయం చేస్తాయి.
రైతులంటే చిన్నచితకా రైతులు కాదండోయ్ ! 
మోతుబరులు!
మోతుబరులంటే అలాంటిలాంటి మోతుబరులు కాదండోయ్!
 అక్షరాలా అయిదెకారాల ముప్పై సెంట్ల మోతుబర్లు !
అవునండీ, పండిన పంటను ఉన్న ఊళ్ళో అమ్ముకోక , మార్క్ ఫెడ్ కు వెళితే మంచి ధర వస్తుందని ఒక రైతు, పట్నానికి పయనమాయ్యాడు. వాళ్ళావిడ ఎత్తిపొడుపులను మెత్తగానే వారిస్తూ” పండిన పంటని పీడాకారం అనుకుంటే ఎట్టే ?” అంటూ.
శీతలగిడ్డంగులకు చేరిన సరుకు అక్కడే ,పడి ఉండగా, ఎగుమతుల ఆంక్షలు తొలింగింప జేసేందుకు కృషి చేస్తున్నామని, అనుమతులు ఇప్పించేస్తామంటూ మంత్రివర్యుల వాగ్దానదాసులవుతూ , మార్క్ ఫెడ్ ఫారాలను చేత బట్టుకొని , పదారు “సంతకాలు” సేకరించి అందుకై ఉన్న నాలుగు రాళ్ళు కరగదీసి, చివరాఖరకు తెలిందేమిటయ్యా అంటే, ఈ రైతు గారు మోతుబరి అని!
ఎలాంటెలాంటి మోతుబరి..? అక్షరలా 30 సెంట్లు అధికంగా ఉన్న మోతుబరి.
“అందులో మూడున్నరెకరాలే పంటేసాను. మిగిందంతా సవ్వనేల ” అంటూ ఆ రైతు నెత్తీ నోరు కొట్టుకొని ఏమి ప్రయోజనం? మోతుబరి మోతుబరే! లెక్కలో తేడాల్లేవిక్కడ!
ఇక, అటూ ఇటూ చెడిన ఆ రైతు కు చివరికి మిగిలేదేమిటి?
గుక్కెడు పురుగు మందా? మూరెడు ఉరి త్రాడా?
మార్క్ ఫెడ్ మాయాజాలమై పోతే , వ్యవసాయం ఎత్తుభారం అయి పోదా?
ఇంతకీ , సదరు రైతుగారు పండించేదేమిటి?
శనగలు, కందులు,మినుములు,పెసలు, వంగ, చివారఖరకు ..వద్దనుకుంటూనే , మళ్ళీ, ప్రత్తి!
విత్తనాలు,సత్తవ మందులు, పురుగు మందులు,కూలిడబ్బులు , వీటన్నిటి కోసం చేసిన బాకీలు, ఇక, ఆ “వడ్డీతొ వడగళ్ళ గుర్రం కూడా పరిగెత్త లేదంట!”
ఆ పై, పల్లెలో మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం లో రైతు చిక్కి విలవిలాడి పోక తప్పదు కదా?
” తనని ప్రేమించి లాలించి అనురాగం పంచీ మమకారం పెంచుకొన్న తన గారాల పుత్రుడి అవసరానికి కాకుండా, తన ఫలం ఎక్కడికో పరాయి ఇంటికి ,పరాయి చోటుకి ,పరాయి అవసరానికి పోతున్నందుకు నేలతల్లి కంట తడి “పెట్టుకున్నదట! కన్నబిడ్డ ఆరోగ్యం ఫణంగా పెట్టిన నిస్సహాయ స్థితిలో , భర్తతో పాటు పొలంలో రెక్కలు ముక్కలు చేసుకున్న” దొడ్డ ఇల్లాలు మల్లీశ్వరి “ఏం చేస్తుంది? ” పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది!” (కోత)
ఎహోషువా రూతమ్మలను ఒకసారి పలకరించి చూడండి. మన పొలం వొట్టిపోవడానికి కారణాలు తెలుస్తాయేమో!
ఎహోషువా మట్టి మర్మమెరిగిన సేజ్జెగాడు. కోల చేతబట్టి కొండ్ర వేశాడంటే ,పంట చాళ్ళలో విరగపండి, ఫక్కున నవ్వినట్లే.ఎద్దులను అదిలించాడంటే , ఇక ఆ ఊరి పురులు పొంగిపొర్లినట్లే. 
తెల్లారి  లేచిన దగ్గరనుంచి ,పొద్దు వాలే వరకూ , అతను చేసిన సేజ్జెం ..రూతమ్మ కడుపు నింపిందా కట్టుకోకలిచ్చిందా ..ఊహు .. చివరకు ..బోరవిరుచుకు తిరిగిన ఆ సేద్యగాడు, అతనితో పాటు రంకెలేసుకు తిరిగిన ఆ ఒంగోలు జాతి గిత్తలు .. ఒక్క ట్రాక్టరు దెబ్బకు ..కాలంలో కలిసిపోవలసి వచ్చింది.
“ఆ పాణం ఉన్న వాటికన్నా లేని వాటితోనే సుఖం రా! చీకూచింతా ఉండదు.ఎద్దులమేతకి ఎంత ఖర్చవతందీ? పని ఉన్నా లేకున్నా మేత తప్పదాయే! లెక్క జూసుకుంటే ఎద్దులసేజ్జం అందదురా,ఎనకటిరోజుల్లో ఎట్టా జేసారో కానీ..” అని ఊళ్ళోని రైతులన్నప్పుడు ఎహోషువా చెపుతాడు కదా”
“ ఎద్దులు గాట్లో ఉంటేనే గాదెలు నిండి పోతాయి గదా కాపా ! ఎద్దులకి వేసే మేత చూశావు కాని ,వాటి పేడ చాలు.బంగారం పంట పండడానికి ! వాటి పేడ ఎంతో సత్తవ కదా కాపా! మనకి ఎంత నయ్యిదిబ్బ తేలిద్దీ?బస్తాల ఎరువులు ఏమొస్తన్నయి..పురుగులు వస్తన్నయి,తెగుళ్ళు వస్తన్నయి,ఖర్చులు ఎక్కువ అవతన్నయి,చివరికి దిగుబళ్ళూ రావడం లా! ”
అదేంటి ఎహోషువా నోట అత్యాధునిక ఆర్గానిక్ ఫార్మింగ్ ,సస్టైనబుల్ అగ్రికల్చర్ లాంటి భావజాలం …అలా దొర్లిపోతున్నది?
అవునండి . ఆ పొలం తనది కాదు. ఆ అరక తనది .ఆ కాడెద్దులు తనవి కావు. కానీ, తరతరాలుగా సేజ్జేగాళ్ళగా బతికిన ఆ ఎహోషువ అనుభవం లోంచి వచ్చిన మాటలవి.రెక్కలకష్టం నమ్ముకున్న ఎహోషువ పట్నం దారి బట్టాడు. అతని మాటలు పెడ చెవిన పెట్టిన ఆ ఊరి రైతాంగం గుక్కెడు విషం పట్టారు!
మరి రైతులన్న దానిలోనూ వాస్తవమున్నది . చూడండి, కాడెద్దులు జతయితే .తమరెక్కలకష్టం తోడయితే , ఉన్న ఎకరం నేల తమను గట్టెక్కిస్తుందని , గంపెడంత ఆశతో బ్యాంకుకు అప్పుకు పోయిన  ఓ రైతు ,చివరకు ఆ వడ్డీ తీర్చడం కోసం ఆ ఎద్దులు,అరక, బండి,ఎకరం నేల అమ్ముకొని ,కుటుంబమంతా కూలిపనికి మళ్ళాల్సిన వైనం ,”బతుకు తనఖా” లో చదవండి!
ఇక, పల్లెటూరి పందాలు ,గెలుపుఓటములు, ఎత్తిపొడుపులు ,వేళాకోళాలు ,గడపదాటని గౌరవమర్యాదలు,పల్లెదాటని మాటపట్టింపులు, చిన్నరైతుల “కలలపంట” ఫేగుతీపి” పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చులు, ఆడపిల్లలకట్నాలు ,అల్లుళ్ళ అరణాలు, కొడుకుల కొత్తపోకళ్ళు, కూతుళ్ల స్వతంత్రభావనలు, కోడళ్ళ కరకరలు,
తలకొరివిపెట్టాల్సిన కొడుకుతో తలపగలకొట్టించుకొని తలవాల్చుకొని నిల్చునే తండ్రులూ,
 చెల్లెలి కట్నంసొమ్మును ఆస్తిలో తన వాటాగా చెల్లుబెట్టి వ్యాపారంలో పెట్టుబడిగా మార్చేసుకొనే అన్నాయి,
నచ్చిన వాడితో నడిచివెళ్ళే చదువుకొన్న అమ్మాయిలు , 
భర్తతో పాటు కష్టమూ నిష్టూరం భరాయించే దొడ్డ ఇల్లాళ్ళు , 
అవసరమైతే ,భద్రకాళులై “ఈ సారి పైకి రా..నరికి పారేస్తా! మొగోడంటనే పేద్ద మొగోడు ! ఆడదాన్ని కొట్టడమా మొగోడితనమంటే ?” అంటూ గర్జించే శాంతమ్మలూ..
అందరికీ అన్నిటికీ అంతఃసూత్రంగా ఆ ఎకరం నేల!
'అర్రుగొర్రు పొలం, మందళ్ళలో జొన్నపైరు '…లాంటి పల్లెగడపలోంచి  పలికే కమ్మని తేట తెలుగు పదాలు పలుకుబళ్ళు తియ్యని గుమ్ముపాలు తాగిన అనుభూతిని ఇస్తే, 
కడుపులో కెలికే కన్నపేగు మెలికలు, చర్రున నసాళానికెక్కే కోపమూ ,అన్నీ తెలిసీ ఏమీ చేయలేని నిరాశా, నేలనమ్ముకొని నలిగిన బతుకులు ,
అన్నిటినీ నడిపించే ఆ ఆర్ధిక మంత్రం రాజకీయ తంత్రమై... కుతంత్రమై ..
రైతు మెడకు చుట్టుకుంటున్న  , ఆ వైనాలన్నీ ఈ కథల్లో చదివాక, 
కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరగకపోతే చూడండి.
పొలంలో నాట్లేస్తూనో , నాగలి దున్నుతూనో ,కలుపు తీస్తూనో,కల్లాం చేస్తూనో, పైటేళ బువ్వ తింటూనో , మాపటేళ మననం చేసుకొంటూనో, 
ఆ రైతన్న మొలకలపల్లి ,పలికిన అచ్చమైన బతుకు కథలివి. ఆ రైతు బతుకులోని అగరు ..వగరు.. పొగరు ..ఎవరికి వారు స్వయంగా రుచి చూడవలసిందే.
అన్ని కష్ట నిష్టూరాలనూ ఓర్చి ,
” ఎల్ల కాలం దండగలు పడతాం ఏందీ? అట్టా పొలంలో ఎప్పుడూ దండగలు పడే పనయితే దేశంలో ఎవడూ పొలం జేయడు.ఇక జనం అంతా ఏం తిని బతుకు తారు ? కొట్టిన అమ్మే పెట్టక మానదు.ఇయ్యాల కాకపోతే రేపైనా వానలు కురవకాపోవు,పొలం పండకాపోదు!”
అన్న ఆశాభావంతో తమను తాము ఓదార్చుకొని , 
మళ్ళీ అరక పట్టి సేజ్జెం మొదలెట్టే .. 
ఆ అన్నం పెట్టె చేతులకు నమస్కారం .
ఒక పాఠకురాలిగా రచయితకు అనేక ధన్యవాదాలు

*
( పుస్తకం .నెట్ వారికి ధన్యవాదాలు)

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 20, 2010

ఒక చిత్రం



మడత పేజీ పుస్తకావిష్కరణ. 
డా. ఆనంద స్వరూప్ గారు, వీవెన్ గారు, డా. మంజులత గారు,
 " మా గోదావరి " కొండవీటి సత్యవతి గారు, అబ్బూరి చాయా దేవిగారు, చంద్ర లత
*

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 11, 2010

అందరికీ ఆహ్వానం.







ఒక కప్పు కాఫీ.
కాసిన్ని కబుర్లు .
ఒక పుస్తకావిష్కరణ
మనమందరం .
ఇంతింత .
మరికొంత.



సమాలోచన

డా. గద్దె  ఆనంద్ స్వరూప్ గారు ,
గణిత శాస్త్రజ్ఞులు ,బ్లాగురచయిత, బ్లాగ్మిత్రులు,
మెల్ బోర్న్ ,ఆస్ట్రేలియా
డా. ఆవుల మంజు లత ,
 పూర్వ ఉపాధ్యక్షులు ,తెలుగు విశ్వవిద్యాలయం
 శ్రీమతి  కొండవీటి సత్యవతి గారు
మా గోదావరి”,బ్లాగు రచయిత,సంపాదకులు ,భూమిక.
 శ్రీ వీవెన్ గారు,
             లేఖిని రూపశిల్పి, కూడలి నిర్వాహకులు,e-తెలుగు స్థాపక సభ్యులు.

                                        అందరికీ ఆహ్వానం.
                                 ప్రత్యేక కార్యక్రమం
శ్రీ వీవెన్ గారు  తెలుగును తెరకెక్కించడంలోని 
మెళుకువలను ,ఉపకరణాలను , బ్లాగు నిర్వహణను
ఇతరేతర e- తెలుగు సమాచారాన్ని అందిస్తారు
మరికొందరు  e - తెలుగు మిత్రులతో పాటు.
మీ  సాంకేతిక పరమైన సందేహాలు,సంశయాలను వారు వివరణలు ఇస్తారు.
మరి మీరు వచ్చేటప్పుడు వీలైనన్ని ప్రశ్నలను వెంటపెట్టుకు రండి
మర్చిపోకుండా!
మీ ప్రశ్నలను ముందుగానే 
 prabhava.books @ gmail.com  కు పంపగలిగితే మరీ మంచిది.
సమయం:

19 సెప్టెంబర్,ఆది వారం
ఉదయం 10:00 గంటల నుంచి 
స్థలం:
సుందరయ్య విజ్ఞాన కేంద్రం ,బాగ్ లింగంపల్లి  , హైదరాబాద్
ఫోన్ :27667543
*


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 5, 2010

చివారఖరకు

ఒక్క విషయం తేల్చి చెప్పేయాలి మీరు!
ఇక్కడ చూస్తోన్న ఈ పూసిన పువ్వేంటో , టక్కున చెప్పగలరా?

బాగా చూడండి. దగ్గరగా.


ఇప్పుడు చూడండి!



తెలియట్లేదా?
పోనీ, తెలుసుకొని చెప్పగలరా?
ఊహు!
నిత్యమల్లి కాదు.
కాగడా మల్లి కానే కాదు.
పట్నం బంతి కాదు.
పగడపు బంతి కాదు.
మాలతి కాదు.మందార కాదు.
ఏమిటీ పిల్లప్రశ్నలు అని కళ్ళెర్రజేసేరు!

పంతుళ్ల పండుగ రోజున ఈ పదారు ప్రశ్నలేమిటని అనుకోబోయేరు!


ఈ పువ్వు పేరు తెలుసనుకోండి .
మంచిది.

నాకు మాత్రం చాన్నాళ్ళ తరువాత ,వెతకగా వెతకగా దొరికింది.
దొరికాక మొదట విత్తులు సేకరించా . దాచిపెట్టి ,ఈ తొలకరిలో నాటేసా.
నాటేసిన కొన్నాళ్ళకే చక చక ఎదిగింది . కణుపుకు ఒక మొగ్గ వేసింది. అన్ని పువ్వుల్లా కాక ,కాస్త ఆలస్యంగా ఏ పదింటికో విచ్చుకొంటోంది.కొద్దిసేపటికే రాలి పోతోంది.
మొక్క మొదలంతా ముగ్గేసి కుంకుమ అద్దినట్లు.
చూశారుగా ,ఆ లేతాకుపచ్చ ఆకుల సొగసు?

సరే, ఎన్నాళ్ళగానో ఆ పూల మొక్క కోసం ఎందుకు వెతుకుతున్నానో అదీ చెపుతా.
మీరిది విన్నారా?

"చిక్కుడు పువ్వెరుపు ..చిలుక ముక్కెరుపు.
చిగురెరుపు ..చింతాల దోరపండెరుపు.
రక్కసి పండెరుపు ..రాగి చెంబెరుపు.


మంకెనపువ్వెరుపు..మావిచిగురెరుపు.
మా పెరటి మందార పువ్వెంతో ఎరుపు.
కలవారి ఇళ్ళల్లో మాణిక్యమెరుపు.
పాపాయి ఎరుపు మా ఇంటిలోన !"

ఇది అన్ని పిల్లల పాట లాంటిదే. రంగులు నేర్పుతుంది .పిల్లలకి.
పెరట్లోను ఇంట్లోను ఉన్న వాటిని చూపుతూ.
అయితే ,మా పిల్లలకు ఈ పాట ను నేర్పుదామనుకున్నప్పడు తెలిసింది. ఇందులోని ఎన్ని పదాలు తెలియకుండా పోయాయో. వాడుకలో లేవో. కేవలం పదాలుగా తప్ప పెరట్లో నుంచి ఇంట్లోనుంచి మాయమై పోయాయో.

కొంత ప్రయత్నం చేసి చూసా.
మా పిల్లలు అంత కన్నా ఘనులు కదా? అదేంటొ చూపించలేనంటే ,ఇక నెత్తికెక్కి కూర్చున్నారు!

ప్రతిపదార్ధాలు ప్రశ్నలూ పదాలపుట్టుపూర్వోత్తారాలు తేల్చి చెప్పనిదే ఊరుకోరు కదా? అందులోను, తెలియని మాటొకటి చెప్పానా నన్ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారన్నమాటే.
అందులోనూ, ప్రస్తావించిన వాటిని కళ్ళారా చూడందే అసలు ఒప్పుకోరు కదా?
ఎందుకు నేర్చుకోవాలీ పాట నంటే  , రంగులు కోసం అన్నాననుకోండి, వారికి తెలియని వస్తువులను ప్రస్తావిస్తూ ఏదో తెలియపరచాలనుకోవడం ఎంత హస్యాస్పదమో చూడండి . అసంబద్దం కూడాను!


సరే, ఓ రాగి చెంబు పట్టుకొచ్చా.మా పెరటి  మందార పువ్వును   మా అమ్మాయే చూపించింది . చిలక ముక్కు సరే సరి. మావి చిగురు కోసం మార్చి దాకా ఆగాల్సి వచ్చింది. అయినా ,పట్టువదలేదు.
చిక్కుడు పువ్వు దొరకలేదు. కావలిసినన్ని చిక్కుడు కాయలు ఉన్నాయి కాని. దాని కోసం , మా పల్లెకు వెళ్ళే దాకా ఆగాల్సి వచ్చింది.
రక్కసి పండు అంటే ఏంటో తెలియదు. బొమ్మజెముడుకాయలు చూపించాను. పొదల్లో పాములు గట్రా ఉంటాయి పిల్లల్నేసుకును వెళ్ళానని చివాట్లు తిన్నాను.
మాగిన చింత కాయను పగలగొట్టి , చింతాల దోరపండును చూపెట్టా.మాణిక్యం చూపించా.

ఇక, చివర వాక్యం వినగానే ,
మా అమ్మాయి వెళ్లి ముఖమంతా ఎర్ర తిలకం పూసుకు వచ్చి ,జడిపించి వదిలింది!
గడ గడ వణికి జొరం తెచ్చుకొన్నాక,
ఆ పై చేసేది ఏముంది, ఆ వాక్యం తీసేయాల్సి వచ్చింది!

ఊ!
ఇక మీకు అర్ధమై పోయిందిగా..

చివారఖరకు మిగిలింది,
ఇదుగోండి, ఈ మంకెన పువ్వు ఒకటి!

అవునండి .. ఈ ఎర్రటి ఎరుపు పువ్వు ,పసుపు పుప్పొడి తో .లేతాకుపచ్చ కొమ్మ కణుపునుంచి ..వయ్యారంగా వాలి ఉన్న మంకెన పువ్వు.

ఒక సారి ఆలోచించండి, మన ప్రకృతిలోనుంచి పుట్టిన ఎన్ని పదాలను మనం కనుమరుగు చేసుకొంటున్నామో. ఎన్ని పదాలకు మూలమైన ఆ చెట్టు చేమలు , జీవజాలాలు  కాలంలో కలిసి పోతున్నాయో.మన భాషను మన భావ
జాలాన్ని పరిపూర్ణత నిచ్చిన  ఆ పచ్చని పదాలు అదృశ్యం  అవుతున్నాయో .అరుదైపోతున్నాయో.

అమ్మలకే అమ్మ ఆ ప్రకృతి ...అన్ని పాఠాలను నేర్పిన మన తొలిగురువు.

మన ఆట, పాట, మాట, నడక., జీవిక ..అన్నీ ఆ అమ్మ ఒడిలోనేగా ఓనమాలు దిద్దుకొంది?

మరి, మానవాళి ఆ గురువుకు ఇస్తోన్న దక్షిణ ఏమిటని ?

ఆ ఆదిగురువు కు జోతలివిగో !

చెయ్యెత్తి!
*
నా మట్టుకు నేను మంకెన పూలు పూయించి తెగ సంబర పడి పోతున్నా. మరి మీరో ?
*
శుభాకాంక్షలు.
*

తాజా కలం: నా వెతుకులాటలో ఈ పువ్వే మంకెన పువ్వు చెప్పేవాళ్ళు కూడా తారసపడలేదంటే నమ్మండి. ఒక పల్లెలో ఒకరి పెరట్లో పూసిన ఈ పూల రంగుకు ముచ్చటపడి ,"ఇదేం పువ్వని" ఆరా తీస్తే ,ఆ ఇంటి పెద్దావిడ యధాలాపంగా అంటే, ఎగిరి గంతేసి విత్తులు పట్టుకొచ్చా.వెతకబోయిన పువ్వు దొరకడం అంటే ఇదే!
*


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Sep 1, 2010

పొత్తపు ఒడి

1
 తొచీ తోచనమ్మ పుస్తకాలవ్యవహారంలో తల దూర్చిందటారేమో - మీరిదంతా  చదివాక!
ఒక అల్లిబిల్లి ఆలోచన ప్రభవగా రూపుదిద్దుకొని అప్పుడే మూడో ఏడు!
*
మొదటిసారి నెల్లూరు వచ్చినప్పుడు - నాలుగు అట్టపెట్టెల్నిండా నాక్కావల్సిన పుస్తకాలన్నీ తెచ్చుకొన్నా.నాలుగునాళ్ళలో చదవడం పూర్తయింది.
లెక్కలు, సాహిత్యం,చరిత్ర చదువుకొనే రోజులవి.లెక్కలు మిక్కిలి.పోతే ,సాహిత్యం.అందునా ఆంగ్ల సాహిత్యం.చదువుదామంటే , కావలసిన పుస్తకాలు కొత్తచోట ఎక్కడ దొరుకుతాయో తెలియదు. క్యాంటర్బరీ టేల్స్ నుంచి కమలాదాస్ దాకా చదవాలయ్యే.
ఊళ్ళో ఉన్న గ్రంథాలయాలు ,పుస్తకాల దుకాణం ఒక చుట్టేసా.
అప్పట్లో ఇన్ని డిగ్రీ కాలేజీలు లేవు.పుస్తకాలు కావలిసిన వారు మద్రాసునుంచో మరో చోట నుంచో తెప్పించుకోవలసిందే.ఊళ్ళో ఉన్న పెద్ద లైబ్రరీ మా ఇంటికి దూరం.వర్ధమాన సమాజం వారు నిర్వహిస్తున్న టౌన్ హాలు లైబ్రరీకి కాస్త కాలుసాగిస్తే వెళ్ళి రావచ్చు.
పనీపాటలు చేసుకొని పడుతూలేస్తూ అక్కడికి వెళ్ళేసరికి , లైబ్రరీ వేళలు కాస్తా అయిపోయేవి.రీడింగ్ రూము మూతపడేది.మళ్ళీ చిరచిరలాడే ఎండలో కాళ్ళీడుస్తూ ఇంటికి.
అసలే  ఎండ.ఆ పై ధారలుకట్టే చెమట.వళ్ళంతా జిడ్డు.పై నుంచి, నిరాశ.
అలా సాగిన లైబ్రరీ ప్రయాణాలలో ,
అతి కష్టం మీద  ఆగి ఆగి ,"విక్రమ సింహపురి సర్వస్వం "చదవ గలిగా. నెల్ అంటే వడ్లనీ అందుకే ఈ ఊరు వడ్లూరనీ.. అదే నెల్లూరు అని ... అలాగే నెల్లి అంటే ఉసిరికాయనీ అదనీ ఇదనీ.. బోలెడంత ఉత్సాహంగా చదివా. ఉదయగిరి , భైరవకోన తదితర చారిత్రక విశేషాలెన్నో తెలుసుకొన్నా.
అక్కడ తెలుగు పుస్తకాలు ఉన్నప్పటికీ , ఆంగ్లం తక్కువ.ఉన్నవి కూడాను ,కాలం నాటివి. అందులోను తీసి ఇచ్చేవారు, తెలియచెప్పేవారు లైబ్రరీలో ఉండే వారు కాదు. ఒకే ఒక్క క్లర్కు. అతనే లైబ్రేరియన్ ,ఆపై సమస్త కార్యనిర్వహణాను. ఏదైనా కార్యక్రమం టౌన్ హాల్ లో ఉందంటే, ఆహ్వానాలు పంచడం దగ్గర నుంచి అన్ని పనులు ఆయన చేతి మీద జరగాల్సిందే.
అందులోను అది బెజవాడ గోపాల రెడ్డి గారి హయాం. అన్నీ పద్దతి ప్రకారం జరిగి పోతూ ఉండేవి.
ఇక, బిక్కుబిక్కు మంటూ , పుస్తకాల నడుమ బైఠాయించి , నాక్కావాల్సిన పుస్తకం చేజిక్కించుకొని, నాలుగు పేజీలు తిరగేసేటప్పటికి , పుణ్య కాలం కాస్తా దాటి పోయేది.
నెల్లూరి విశేషమేమో , పుస్తకాలు పచ్చబడి ,పట్టుకుంటే విచ్చిపోయేంత పెళుసుబడిపోతాయి.
బహుశా బంగాళాఖాతం ఉప్పుగాలి మహత్యం అనుకొంటా!
ఒక రోజు ,ఎండనబడి వెళ్ళి ,లైబ్రరీ మూతబడి ఉండడంతో ..యధాప్రకారం , కాళ్ళీడ్చు కొంటూ తిరిగి వస్తుండగా ,సరిగ్గా  సండే మార్కెట్ మలుపు తిరిగే చోట,ఒక బడ్డీ కొట్టు ముందు ఆగా.రోడ్డు దాటుదామని అటూ ఇటూ చూస్తూ.
అలా చూస్తున్నానా , మూల మీద కొన్ని పుస్తకాలు.
ఆశ్చర్యం ! అక్కడనుంచి రాహులు సాంకృత్యాయన్  దరహాసం!
ఎగిరిగంతేసింత పని జేసి , అక్కడికి గబ గబ వెళ్ళా.
నాకు నోట మాటరాలేదు. అదేదో చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు,మా పొగతోటలో, అందునా మా వీధి చివర పుస్తకాల దుకాణం పెట్టుకొని ఊరంతా తిరిగేసిన నా తెలివిడికి నాకే నవ్వొచ్చింది!
2
మణి గారు మౌనంగా పుస్తకాలు సర్దుకొంటున్నారు.
అక్కడ ఉన్న పుస్తకాలు అప్పటికే చాలా మటుకు నా దగ్గర ఉన్నాయి.బాగా దిగులేసింది.కాకపోతే, చిన్నప్పుడు నేనెంతొ అభిమానించిన రష్యన్ పిల్లల పుస్తకాలు , నాకు ఊపిరి పోసాయి. మళ్ళీ నా బాల్యం అక్కడ ప్రోది చేసుకొన్నాను.
ఒక ఉల్లిపాయతో రెండుపూటలా తిరగమోతలేసుకొనే రోజులవి.రోజుకొక పూట కూరో ,ఒక మూర మల్లెలో తగ్గించుకొంటూ, వారానికి  ఒక రోజన్నా మణి గారి అంగడి దాకా వెళ్ళి వచ్చే దానిని.నేను స్వతహాగా బిడియస్తురాలిని. ధరవరలు మాట్లాడే ధైర్యం ఉండేది కాదప్పుడు.
పుస్తకం చూపించి, దాని మీద అచ్చేసిన డబ్బులు ఇచ్చేసి వచ్చేదానిని.ఒకా మాటైనా మాట్లాడకుండా .
అలా ఏడాదో రెండేళ్ళో గడిచింది.
మణి గారేమో మహా కచ్చితం మనిషి. లెక్కంటే లెక్కే.మాటంటే మాటే.
పుస్తకం ముట్టుకోను వీలు లేదు.పేరు చెపితే ఆయనే తీసి,పైకెత్తి పట్టుకొని, బడ్డీ కొట్టులోంచి  చూపిణ్చే వారు.
మాంత్రికుడి మాయలపెట్టిలా , చిన్న బడ్డీ లో , ఎన్ని పుస్తకాలో. తీస్తున్న కొద్దీ వస్తూనే ఉండేవి.
 రోడ్డు పక్కనే ఉండడం వలనేనో  పుస్తకాలను ప్లాస్టిక్ కాగితంలో చుట్టేసి భద్రంగా ఉంచేవారు. అందులోనూ పొగతోట గాంధీనగరమంతా మట్టిరోడ్లేగా.
అటు సాయిబాబ ,ఎదురుగా సుబ్రహ్మణ్యం దేవళాలు .
ఇక ఊరంతా అక్కడే కదా.  తిరిగే వాహనాలు.ఎగిరే ధూళి .ఆ మాత్రం జాగ్రత్త అవసరమే .
అంత మంది భక్తుల రాకపోకల మధ్యా, అటూ ఇటూ గుడులు కొలువుదీరిఉండగా, నట్టనడుమ  మణి గారి అంగడి. ఇక అక్కడ ,సమస్త హేతువాద, నాస్తిక, ఇతర ఉద్యమ నేపధ్య రచనలు, పత్రికలు.

మణి గారు మెల్లి మెల్లిగా ,ఆహ్వానాలు,కరపత్రాలు ఇవ్వసాగారు. అలా మొదటసారి వారి అచ్చేసిన "మరణశాసనం " చూశాను.
".మనలాంటి వారేనే వీరూను "అని ఒక్కరవ్వ సంతోషపడ్డా.
అసలే పెద్ద వారు.అందులోను మాట కరుకు. మా మధ్య పెద్దగా మాటల పరిచయం సాగలేదు. మహా అయితే ,ఒక పలకరింపు నవ్వు ..ఇచ్చిపుచ్చుకొనే వాళ్ళం.
పుస్తకాలు పరిమితం గానే ఉండేవి. ఆంగ్లసాహిత్యం అసలే లేదు. మళ్ళీ వేట మొదలు.
మణి గారి వద్దే, ప్రేంచంద్ పుస్తకాలన్నీ చదివింది.గురజాడను,రాహుల్జీని మళ్ళీ పలకరించింది.
మణి గారి మాటతీరు మర్మమేటో ,కొంత కాలం పోయాక గానీ అర్ధం కాలేదు. వారి మాతృభాష మళయాళం. తెలుగు మాట్లాడడం , చదవడం నేర్చుకొన్నారు. డిగ్రీలు లేవు .కానీ వారు చదవనిపుస్తకం అక్కడ పెట్టలేదు. వారి పట్ల గౌరవం ఎంతో పెరిగింది. భాష కాని భాషను నేర్చుకొని, అందులోను , మంచి పుస్తకాలను ,ముఖ్యంగా, ప్రగతిశీల భావాలు గల పుస్తకాలను మాత్రమే , అమ్మడం ,ఆ వచ్చే పరిమిత ఆదాయంతో ఒక్క కొడుకునూ , డాక్టరుగా తీర్చిదిద్దడం, వారు తండ్రి నేర్పిన బాటలో ,పల్లె పిల్లలకు వైద్యం చేయడం ,
ఇవన్నీ మా కుటుంబ స్నేహాన్ని ఏర్పరచడం  ,తర్వాతి సంగతులు.
ఇక, మణి గారు వారబ్బాయి వద్దకు విశ్రాంత జీవితం గడపను వెళ్లడం తో మరో అధ్యాయం ప్రారంభం

*

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.