Nov 24, 2010

పల్లెమూలాలు

స్వేచ్ఛ, సమత, సౌభ్రాతృత్వాలతో నిండిన మానవ విలువలను ఆవిష్కరించ గలిగే సమర్థత 
సాహిత్యానికి ఉన్నది.
సమాజాంలో అంతర్లీనమై సమాజాన్ని ముందుకు నడిపించగల భావ పరిణితి,మేధో చింతన  ,మానసచేతన ,మానవ సంస్కారం ,సామాజి ఆర్ద్రత  రచయితకు ఉన్నప్పుడు ఆ రచన ఉన్నత విలువలతో మనకు అంది వస్తుంది.
ఆయా తరాలలో నవలారచయితల పరిమితులను అర్ధం చేసుకొంటూ , పరిణితిని స్వీకరించే ప్రయత్నం చేద్దాం.
అలనాటి అగ్రహార దురాచారాలను దురభ్యాసాలను ఎండకడుతూ కళ్ళు తెరిచిన రాజషేఖర చరిత్రము (1878) తెలుగు నవలకు నిజాయితీని నిబద్దతను  మార్గనిర్దేశం చేసింది.
"మాల పల్లి" లో మొదలైయిన సాంఘిక చైతన్యం కీలుబొమ్మలలో భావ చైతన్యం అయితే ,
“ప్రజల మనిషి " " జనపథం"లో “మోదుగుపూలు” పూయిస్తే , "మట్టిమనిషి " "ఆక్రందన" రేగడివిత్తులై" మొలకెత్తితే  "- చీకటిగదులలోని రాబందులను రామచిలకలు " నిలువరిస్తే నిలదీస్తే - 
"కొల్లాయి గట్టితేనేమి ?" నిబ్బరంగా " రథచక్రాల"పై నిలిచిఉంది తెలుగు నవల.
" చిల్లరదేవుళ్ల" కు వలసదేవర" చేసిన కాలరేఖలు " మన ముందు ఆవిష్కృతమయ్యాయి.
 "చివరి గుడిసె  లోని మూగవాని పిల్లనగ్రోవి " పాట ,"రాముండాడు రాజ్జివుండాది " "గద్దలాడండాయి "నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది.
"గంగు "  లిఖించిన " బతుకు పుస్తకం "పుటలు "పంచమం"అయి , అంటరానివసంతం" లా మోసులు వేస్తూనే ఉన్నది."కాడి" మోస్తూనే ఉన్నది.
భిన్న కాలాలు .భిన్న నేపథ్యాలు. భిన్న సంధర్భాలు. భిన్న దృక్పథాలు. భిన్న పార్ష్వాలు.  
కేవలం కాలక్షేపం కోసం కాకుండా కాలగమనాన్ని కాలానుగత గ్రామీణ జీవితాన్ని కలకాలం పదిలం చేసింది. చేస్తూనే ఉన్నది తెలుగు నవల.
గత శతబ్దం ఆరంభంలోనూ ,నడుమ వచ్చిన కొన్ని తెలుగు నవలలు  ...
 ఏ ఒక్క గ్రామానికో పరిమతమై ఫోకుండా, ఆయా రచయితల భావచైతన్య రూపాలుగా తాత్విక ప్రాతిపదికలుగా ఉన్నతప్రామాణికతను సాధించాయన్నది కాలం నిరూపించిన సత్యం.
అయితే , గత శతాబ్దాంతపు నవలలు ఈ శతాబ్దారంభ నవలలు కాలం పరీక్షలో నిగ్గు తేలవలసి ఉన్నది.
ఈ నాటికీ మనం గ్రామీణ వ్యవసాయం పైననే ఆధారపడి ఉండడం .. పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం.. విపరీతమైన జనాభా పెరుగుదల ..ఉపాధి అవకాశాల లేమి .. అనివార్యమైన పట్టణీకరణ ,క్రిక్కిరిసిన పట్టణ నగర జీవనం , ప్రపంచీకరణ... 
 ఈ నాటి నవలారచయితను మళ్ళీ గ్రామల వైపే నడిపిస్తున్నట్లుగా ఉన్నది.
మాయమవుతున్న మారుతున్న విలువల కోసం మూలాల కోసం .. పల్లెల్లో వెతుకులాడున్నాం.

సమాచార విప్లవం చేత గ్రామీణజీవితంలో పెనుమార్పులు వచ్చాయి. లోకజ్ఞానం పెరిగింది. ప్రశ్నించే హక్కును ప్రజలు వినియోగించుకొనే వీలు పెరుగుతోంది. ప్రజాస్వామ్య స్వభావ స్వరూపాలు అవగాహన అవుతున్నాయి.
మరో వైపు వస్తు సంస్కృతి గ్రామగ్రామాలకు విస్తరిచిపోయింది.వినిమయప్రపంచం శాసిస్తోన్న విలువలు జీవనవిధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి.వేగంగా మారిన మారుతోన్న జీవన చిత్రాన్ని ఈ తరం తెలుగు నవల అంతే ఒడుపుగా పట్టుకోవాల్సివుంది.
వస్తువులోనూ శిల్పంలోనూ భావపరిణితిలోనూ కళాత్మకతలోనూ సందిగ్దత కనబడుతోంది. బహుశా ఈ సందిగ్దత సమాజంలోని సందిగ్దతే కావచ్చు. 
వేగంగా నలువైపులా విస్తరిస్తోన్న మార్పును స్వీకరించ లేని అన్వయించుకోలేని రచయిత అశక్తతే కావచ్చు. 
స్వీయ శక్తి సామర్హ్ద్యాలపై  కాకుండా ,ఆనాటికి అంది వచ్చే అభిప్రాయలపై ఆధారపడే ఆశ్రయ ధోరణి  వలన కావచ్చు
.ఏమైనా ఈ తరం రచయిత విశాల దృక్పథాన్ని నిండిన మానవవిలువలను ఆవిష్కరించే కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది,
వ్యక్తి , కుటుంబం ,సమాజం ,రాజ్యం ,మతం ,తత్వం,చరిత్ర ,సంస్కృతి ,ఉద్యోగం ,ఉద్యమం .పెంపుముంపు ,కరువుకాటకం ,పంట పరిశ్రమ , 
అన్నిటికీ గ్రామీణజీవితమే నవలానేపథ్యమైంది.
ఆనాటి నుంచి ఈనాటి వరకు.
తెలుగువార్లో అణువణువునా నిక్షిప్తమై ఉన్న పల్లెమూలాల్ని కదిలించగల ఆత్మీయ పలకరింపులా మన ముందు ఉన్నాయి తెలుగు నవలలన్నీ .
తెలుగువారి వాడీ వేడి  ,వాడుక వేడుక ,మర్యాదమన్నన - గ్రామసీమ.
తెలుగు వారి ఎదసవ్వడి ,హృదయవేదన ,గుండె చప్పుడు -పల్లెపట్టు.
అప్పుడు ఇప్పుడు.
ఇది సత్యం!
అందుకు తెలుగు నవల ఒక సజీవ సాక్ష్యం!

( ప్రపంచ తెలుగు సమాఖ్య వారి ప్రత్యేక అనుబంధం కొరకు వ్రాసిన(28-10-4) వ్యాసం లోంచి మరి కొంత )

  

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment