Oct 29, 2010

తలా ఓ పుస్తకం !

పిల్లలు వచ్చారు.
పుస్తకాలు చదివారు.
పరిచయం చేశారు!

నవంబరు నెల .
నెల్లూరు వానాకాలం.
జడి వానలో తడుస్తూ వణుకుతూ ..
పిల్లలు ..పుస్తకాలు...కబుర్లు.
ఆ విశేషాలు ఇక్కడ చూడండి.

http://prabhavabooks.blogspot.com/

***



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 27, 2010

అక్షరాలా... అపరంజి !

అదేంటో గానీ,చెడు వినొద్దు కనొద్దు అనొద్దు ...అని
అచ్చం మన గాంధీతాత అనుంగు మనవరాళ్ళూమనవళ్ళలా  ...అనుకుంటామా..
చెడు చూడకా తప్పదు.వినకా తప్పదు.
ఇక అనడం అంటారా, అది మన పెదవి దాటే పలుకు  కనుక ...ఎంతోకొంత మన అధీనంలోనే ఉంటుంది ...కనుక ఫరవాలేదు.
కానీ, చూడవలసిన  దృశ్యమూ ..వినవలసిన విషయమూ ..పరాధీనమే కదా !

నిన్న గాక మొన్న "అలనాటి నెల్లూరు"పుస్తకావిష్కరణ సభను ముక్తాయిస్తూ జ్ఞాపకం చేసుకొన్నాను.. పూర్ణమ్మను.
"నలుగురు కలిసి నవ్వేవేళల నన్నోపరి తలవండీ" అని అంటుందే ఆ మరుపురాని మాటలను.
పూర్ణమ్మ, మన తెలిగింటి పుత్తడి బొమ్మ.
 కాలం కదిలి పోయింది.కన్యాశుల్కం ,బాల్యవివాహాల దురాచారం సమసిపోయింది.
ఒక సంస్కర్త, రచయిత దార్శనికుని   ...ఆవేదన ఆలోచనై ..అక్షరాలా తీర్చిదిద్దిన అపరంజి ,మన పూర్ణమ్మ .
మన గుండెల్లో పదిలంగా నిలిచి పోయింది .అదాటున పలకరిస్తూ. ఒక దురాచారాన్ని గుర్తుచేస్తూ.
ఎవరింట పుట్టిందో ..ఎవరింట మెట్టిందో ..ఏ కోనేట గిట్టిందో ..కానీ ,
మన సాహిత్యంలో నిలిచిపోయిన చిట్టిచేమంతి, మన పూర్ణమ్మ.
*
చెడుచూడొద్దు వినొద్దు అని బుద్దిగా నమ్మే నేను, టివి సీరియళ్ళు గట్రాలకు ఆమడ దూరం కదా...అలాంటింది అదాటున ఒక దృశ్యం చూడవలసి వచ్చింది.
నేతి బీరకాయల్లో నేతినీ , సీరియళ్ళలో నీతినీ వెతికేంత అమాయకురాని కూడా కాదు కదా ..
అయినా ,
ఒక ముక్కు పచ్చలారని పసిబాలికను పెద్దముత్తైదువలా అలంకరిచి ,ముదినాపసాని మాటలతో ముంచి తేలుస్తూన్న..ఒక అత్యంతాదరణ పొందిన  సీరియల్ చూడనే చూసాను.
ఉమ్మడి కుటుంబం, బాల్యవివాహం, మేనరికం, అత్తల, అత్తల అత్తల సాధింపులు,నిప్పులగుండంపై నడకలు, ఆ పాప చెల్లించాల్సిన మొక్కులు,చదవ నీయకుండా చేయడానికి సవాలక్ష అడ్డంకులు ,పుస్తకాల సంచిలో పగిలిన గాజు ముక్కలు, పుస్తకం ముట్టుకొంటే రక్తసిక్తమయ్యే చెయ్యి, ఎడం చేత్తో పరీక్షరాసి "ఫస్టున" పాసవ్వడం, ఇక , ఆ పాప "భర్త" మరొక పసి బాలకుడు అదే పరీక్షలో ఫెయిల్ అవ్వడం, ఇక, విలనీ బామ్మలుతాతయ్యలు పెంచి పోషించే కాంప్లెక్షులు కాకరకాయలు!
 ఈ పాప కు పుస్తకాలు తోడుంటే "ఎదిగి పోతుందని" చేంతాడు చెత్తమాటలు గుమ్మరించి .. విలనీ బామ్మ పుస్తకాలు చించి చించి ..అపై సంచిని విసిరి కొట్టడం...
ఈ సుధీర్ఘ దైనందిన సీరియాల్.. నిరాఘాటం గా సాగిపోతూనే ఉంటుంది...
మిమ్మల్ని ఆ వివరాల్తో విసిగించను ...కానీ, అమ్మలారా అయ్యలారా...నేరాలు ఘోరాలు ఇంతకన్నా క్రూరంగా ఉంటాయా?
ఒక వైపు ఆడపిల్లలు ,వారి క్షేమాన్ని కోరేవారందరూ  ...బాలికల ఉనికిని ,జీవితాన్ని ,జీవనాన్ని ..పునర్నిర్వచించే ప్రయత్నాల్లో శతాబ్దాల తరబడి చేస్తోన్న పోరాటాలు...
 మరొక వైపు ,ఆమ్నియోసింథసిస్  నుంచి ఆమ్లదాడుల వరకు విస్తరించిన అత్యాచారాలు, 
బాలికలపై విచ్చలవిడివిడిగా సాగుతోన్న హింస ,దౌర్జన్యాలు, దుర్మార్గాలు...
నిశ్శబ్దం గా మనల్ని మరో వందేళ్ళు  గిర్రున వెనక్కు తిప్పే నడిపే ..ఇలాంటి ప్రజాదరణ పొందిన సీరియళ్ళు..
...అవి తీసిన వారు...చూస్తున్న వారు ..చేస్తున్న వారూ .. పదిలంగా ఉండగా ...
ఒక్క సందేహం. 
ఒకే ఒక్కటి.
వాళ్ళు బహుశా మరిచిపోయారో....  తలవనే  తలవ లేదో ..
గానీ , ఈ వ్యవహారమంతా .. మన మానవ హక్కుల ఉల్లంఘన కాదూ? 
మన మౌలిక మానవ సంస్కార వికాసానికి ప్రతిష్టంభన కాదూ?
ఆ బాల నటుల  మనోవికాసం నుంచి ,ఆ నటనను చూసి చౌడుదేరుతున్న బాల ప్రేక్షకుల మెదళ్ళ మొదళ్ళలోకి...
స్థిరపడుతున్న బాల్యహింస!
బాల పాత్రచిత్రణలో హింస ఇంత బాహాటంగా ,విచ్చలవిడిగా  ప్రకటించబడుతుండగా , 
త్వరలో పిల్లల పండుగ ఎలా జరుపుకోవడం?
కళలో కల్పనలో ఎదైనా చెల్లుదన్న పోయెటిక్ జస్టిఫికేషన్ , అర్టిస్టిస్టిక్ జస్టిఫికేషన్ ఇలాంటి వాటి విషయంలో ఇట్టే అంది వస్తుంది.
కల్పనలో ఏదైనా చెల్లుతుందనీ కాలస్థలనియమాలతో పని లేదనీ ..సమర్ధించేయవచ్చు.
కానీ, మన కంటిని మన వేలితో పొడిచే ఇలాంటి దురాకల్పనలు మనకెందుకు?
ఆయా పాత్రలలో "జీవిస్తున్న"బాలనటులు రాబోయే పిల్లలపండుగ రోజున ,"మహా బాలనటులని" బిరుదాంకితులయినా మనమేమీ ఆశ్చర్య పోనక్కరలేదు. ఆశ్చర్యపోము కూడాను!
ఇంటిగడప దాటని, ఊరిపొలిమేరయినా మీరని ..కొండల్లోకి కోనల్లోకి కూడా ఇలాంటి ..సీరియళ్ళన్నీ చేరుతున్నాయి కదా?
ఇప్పుడిప్పుడే అక్షరం చేతబట్టి ,  చేతనాక్రమంలో ...పరివర్తనా దిశగా... బుడి బుడి అడుగులు వేస్తున్నవారి ముంగిళ్ళ లోకి ..వెళ్ళి ఇవి తిష్ట వేస్తున్నాయి కదా?
హత్యలు,మాన భంగా లు,కిడ్నాపులు ,చేతబడులు,శవాలపూజలు , ఇప్పుడిక బాల్యహింస ..
ఇలా అడ్డూఅదుపూ లేకుండా ..ఈ విచిత్రవిన్యాసం సాగవలసిందేనా?
 పగ,కక్ష, ద్వేషం ,హింసలలో ముంచెత్తుతోన్న బాల్యాన్ని చూస్తూ ఊరుకొందామా?
మరొక పుత్తడిబొమ్మ ఈ నేలపై తిరగాడకూడదనేగా ఆ మహానుభావుడు  పూర్ణమ్మకు ప్రాణం పోసింది. 

ఇవాళ్టి ,బాలపాత్రల చిత్రణ గురించి వీసమెత్తు ఊహించగలిగినా , గురజాడ గుప్పెడు  గుండె ..ఎంతలా విలవిలలాడిపోయేదో..!
అంతటి ఆశయాన్ని తప్పుదోవ పట్టించి ..టీఆర్పిలు పెంచుకోవడం ..ఎంత విషాదం !

 సున్నితంగా సృజించవలసిన ..పువ్వులాంటి పిల్లల పాత్రల చిత్రణలో.. 
మాధ్యమాలు ఏనాటికైనా కళ్ళుతెరుచుకోవాలని ,
మనం కళ్ళు చెవులు  నోరు ...మూసుకొని 
 ప్రార్ధిద్దామా?

 బాలనటుల దుర్భరస్థితికి ,బాలప్రేక్షకుల దౌర్భాగ్య పరిస్థితికీ ,

రెండు నిమిషాలు మౌనం పాటిద్దామా?

పిల్లల పండుగ వేళ !

తెలుగుజాతి యావత్తు ..
సమిష్టిగా !

***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

గవ్వ మీది రంగులు

3
ప్రతిఫలం ఆశించని ఈ సాహితీ బంధువు బదులుగా కోరేది ఆగకుండా రాయడాన్నే.
రాస్తూ ఉండడాన్నే.
అయితే,ఎలా పడితే అలా రాయడాన్ని కాదు. 
మొదట రాసిన దానికన్నా మరింత మెరుగుగా రాయడాన్ని .
మరింత ఉన్నతంగా  రాయడాన్ని.

"ఆవేశంతో రాసుకు పోవడం ఇతర సాహితీ రూపాలలో కొంత మేరకు చెల్లుతుందేమో కానీ ,నవలా రచనలో చెల్లదు.మానవ విలువల ఆంతర్యాన్ని ఆవిష్కరించడానికీ ,నవరసాలను సముచితంగా చిత్రించడానికీ ,జీవితాన్ని ప్రతిఫలించడానికి ,విస్తృత అవకాశం ఉన్న నవల ఉత్తమ సాహితీ రూపం .నవలారచనకు ఎంతో అధ్యయనం ,అవగాహన కావాలి . రచన చేయ గలిగిన ఉత్సాహం ఒకటే చాలదు. నవలారచయితకు దీక్షాదక్షతలతో పాటు 
నిజాయితీ నిబద్దతలు ఎంతో అవసరం. ," చేరా గారు ఒక మారన్నారు ," ఆ అధ్యయనం అన్ని కోణాల్లోంచి మూలాల్లోకి జరగాలి. ఎంచుకొన్న విషయాన్ని ఎంతగా అర్ధం చేసుకొంటే అంతటి అర్ధవంతమైన రచనలు చేయగలరు.ఉత్తమ రచనకు వేరొక అడ్డదారి లేదు. సునిశిత పరిశీలన ,నిరంతర అధ్యయనం తప్పనిసరి."


చేరా స్వయానా నిరంతర పాఠకుడు.


కవిత్వం చదివింత  ఆప్యాయంగానే సాహిత్యాన్నంతా చదువుతారు.
మొదట భావం కోసం.మరల భాష కోసం.
పదం నుంచి పాట వరకు. వాక్యం నుంచి వ్యాసం వరకు.
కల్పిక నుంచి కథ వరకు.
నాటిక నుంచి నవల వరకు .ప్రాచీనం నుంచి అత్యాధునికం వరకూ.


చేరా ఒక రచనను కవిలా చదవగలరు. రసజ్ఞత పొందగలరు.
ఒక విమర్షకుడిలా చదవగలరు.ఆంతర్యం గ్రహించగలరు.
ఈ భావుకుడైన పండితుడి భావసాంద్రత ,పదసౌందర్యం ఆయన ప్రత్యక్షరంలో ప్రత్యక్షమవుతుంది.
ఈ మానస సంస్కారమే అంతః చేతనే ఆయన మానవసంబంధాలలోకి ప్రసరిస్తుంది.


ఆయన జ్ఞాపకాల చిరుజల్లులలో పిడుగుపాటులో , తడిచిన వణికిన దడిచిన  మనకూ .. ఆయన పట్ల సాన్నిహిత్యం కలుగుతుంది.గౌరవం పెరుగుతుంది.కిణాంకమై మిగులుతుంది.

"ఇచ్చట పీఠికలు రాయబడును .సమీక్షలు చేయబడును ," అంటూ ప్రకటనలు ఇవ్వక  పోయినా ,చేరా ఇంటికి కొనితెచ్చుకొన్న మొహమాటాలెన్నెన్నో! నిందలలో నిష్టూరాలలో నిలువునా తడుస్తూ !


ఒక మారు ,ఆయన ముందు ఓ పెద్ద కాగితాలకట్ట పెట్టుక్కూర్చున్నారు. ఆరా తీస్తే, అది ఎవరో కాలమిస్టు మిత్రుడు రచించిన వందలాది , బహుశా వేలాది,కాలమ్స్   కవిలకట్ట.
ఆ వేలాది చిరిగిన చెదిరిన నలిగిన కాగితాల నుండి ఓ వంద ఉత్తమ రచనలను  ఏర్చికూర్చి పెట్టమని చేరాను కోరారా మిత్రుడు. పనిలో పనిగా పీఠికా రాయమని.ఆ తరువాత సమీక్ష చేయమని !

చేరా గారు అప్పటికింకా "గుండె కోత "  నుంచి  తేరుకున్నట్లు లేదు! ఈ వ్యవహారమంతా వారి శ్రీమతి గారికి గుండెకోతగా పరిణమించింది!
స్నేహబంధం పట్ల గౌరవం కొద్దీ మొహమాటం కొద్దీ , ఆ పనిని చేరా సంతోషంగా చేయ  బూని ఉండొచ్చు కాక ! ఇలాంటి కూర్పుకర్త పనేనా చేరా మాష్టారు చే వలసింది? దానివలన చివరకు మిగిలేది ఏముంది ? మాష్టారి ఆరోగ్యానికి చెరుపు కాక ! కుటుంబసభ్యులకు వెరుపు కాక!
చేరా ప్రధాన కృషీ ప్రత్యేకకృషీ చేసిందీ చేస్తున్నదీ భాషాశాస్త్రంలో .ఇది ఆయన ప్రత్యేకత .ఇదే అసలు సిసలు ప్రత్యేకత.ఇదే ఆయనే చేయగలిగిన ఆయన పని !
ఈ రంగం లో చేరా జీవిత కాల కృషి ఇంకా అక్షరబద్దం కాలేదు. "అది నా బద్దకమే .." అంటూ పకపకా నవ్వేయడం చేరాకు అలవాటే.
హోంవర్క్ చేయడానికి పాలుమారిన పిల్లవాడూ మాట మార్చేయాలని నవ్వే నవ్వులు రువ్వుతూ.
ఆయనే చేయగలిగిన ఆయన పనిని చేసేట్లు చూడవలసిన బాధ్యత చేరాభిమానులందరిదీ. మాష్టారి చెవి మెలిపెట్టయినా సరే!

తడి ఇసుకలో  లో అదాటున దొరికిన గవ్వ మీది రంగుల్ని చూసి సంబరపడే పిల్లవాడూ.. 

స్వేచ్చకూ చైతన్యానికీ .. సూక్ష్మానికీ స్థూలానికీ  .. ప్రజ్ఞకూ విజ్ఞతకూ ..సౌందర్యానికీ సౌజన్యానికీ ..
నడుమ ఒక సమన్వయ ప్రమాణాన్ని చూపగల పండు మేధావి ..


ఆయనలోనే ఉన్నారు.


మనందరికీ చేరువలో ...


 మన చేరా!


*
("మన చేరా" సంకలనం ,"చేరా పై రాతలెందుకని ..!?!" నుంచి  కొంత , 15-4-2003)


*
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.