Feb 28, 2011

ఎంత మేరకని !

ఒక్కో సారి అంతే !
మన జీవితాలకి సంబందించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు-
ఎక్కడో జరుగుతుంటాయి. ఎవరో తీసుకుంటుంటారు.ఎప్పుడో తెలుస్తుంటాయి.
మనం అలా చూస్తూ ఉండాల్సి వస్తుంది.
నిశ్శబ్దంగా.
మనం అలా జీవించాల్సి వస్తుంది.
నిస్సహాయంగా.
చూడండి.
అది వ్యక్తిగతమైనదైనా, కుటుంబపరమైనదైనా, రాజకీయమైనదైనా, సాంస్కృతికమైనదైనా .
మనం పిల్లలం కావడం చేత  కొన్ని సార్లు,
మనం మహిళలం కావడం చేత ఎన్నో సార్లు,
మనం సిబ్బంది కావడం చేత మరికొన్ని సార్లు, 
స్వతంత్ర దేశ పౌరులం కావడం చేత అనేక సార్లు, 
అందుచేత ఇందుచేత ,
ఆ నిర్ణయ భారాలను మోస్తూ బతకాల్సి వస్తుంది.
కష్టమైనా.నష్టమైనా.
అచ్చం ఆ జీమూతవాహనుడి తల మీద గిరగిరా తిరిగే చక్రంలాగా!
అతనిని పలకరించిన పాపానికి , 
ఆ బాధాచక్రం అతని తలపై నుంచి అడిగినవారితలపైకి ఆ చక్రం ప్రత్యక్షం అవుతుందేమో కానీ,
మన విషయంలో అలా జరిగే అవకాశం ఏదీ? మన తలపై భారం మోయడానికి వేరొకరు ఎక్కడ?
ఎవరి నిర్ణయభారం వారు మోయలేనప్పుడు ,అసలా నిర్ణయం అంగీకరిచడం ఎందుకు?
ఎంత మాత్రం సబబు?
అయినా, ఎవరి నిర్ణయాలకు ఎవరు కర్త? ఎవరిది కర్మ? ఎవరు బాధ్యులు?
నిజమే.
తీరా చూస్తే , ఈ నిర్ణయాలంత సాపేక్షాలు మరోటి ఉండవు.
ఇవ్వాళ తినబోయే అన్నంలో కూరేమిటో అన్న దగ్గర నుంచి,
ఆ కూరలోకి అవసరమైన వంకాయ మొదలు తిరగమోత వరకు -
తీసుకోవల్సిన నిర్ణయాలు , ఆర్ధిక, రాజకీయ, సామాజిక , చారిత్రక నిర్ణయాలే! కాదన గలమా?
అన్నిటికన్నా ,ముఖ్యంగా ఇలా వంటింట్లో మొదలయ్యే  నిర్ణయాల రాజకీయం చట్టసభల దాకా సాగుతుండం పరిపాటని మన అనుభవమే కదా?
అంతెందుకు ? 
అమ్మకు తోచిన కూర వండాలా? నాన్నను అడిగి వండాలా? పిల్లలు కోరింది వండాలా? బజార్లో దొరికింది వండాలా? మనం కోరి వండదలుచుకొంది బజార్లో దొరకాలా? 
అన్నీ ప్రముఖ నిర్ణయాలే !
ప్రధానమైన నిర్ణయాలే!
కాదనగలమా?
అలాగే,
ఏ నిర్ణయం మంచిది ఏది కాదు ..అన్నది ఎవరూ గుణించేది?
ఆ నిర్ణయాలను తీసుకొనేవారా? అమలు పరిచేవారా? ఆ నిర్ణయం వలన రాబోయే మంచీ చెడులను భరాయించే వారేనా?
మరి, నిర్ణయాల పాటికి నిర్ణయాలు జరిగిపోతుంటే , 
ఆ నిర్ణయం తీసుకోవడంలో ప్రమేయం, భాగస్వామ్యం లేకుండా,
ఆ నిర్ణయాలఫలితాల్ని తలకెత్తుకోవలసిందేనని తెలిసినపుడు ,
ఆ నిర్ణయం తీసుకోవడంలో భాగం పంచుకోవడం మనకు అవసరమనీ ,ఆవశ్యమనీ..
తెలియపరచకుండా ఉండగలమా?
నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఉండగలమా? నిలదీయకుండా ఉండగలమా?
ఎవరి నిర్ణయం వారిది.
ఎవరి నిర్ణయభారం వారిది.
మరొకరి నిర్ణయం మనది చేసుకోవాల్సి వచ్చిందనుకోండి ,
ఆ క్రమం లోనే ఈ ప్రశ్నలన్నీ!
అప్పుడప్పుడూ..అందరికీ ఎంతోకొంత మేరకు- తప్పనివి!
అయితే ,
అది ఎంత మేరకు ?
ఇదీ మన ముందున్న ప్రశ్న!
*** 
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Feb 26, 2011

నేను లేనూ- ఇపుడిపుడే రానూ ..


వురేయ్ ఈ ఖద చదివేవాడూ..ఈ ఖద చదివేవాడూ! ఆ గోపిగాడొస్తే నేను లేనూ- ఇపుడిపుడే రానూ -తెలుగు సినిమాకి వెళ్ళిపోయానూ అని చెప్పరా- ఎం?"
***అయిపోయింది***

అయిపోయిందంటూ  మనకి దూరంగా పరుగులు పెట్టేసిన ఆ పెద్దాయనకు 
ఏమని చెప్తాం?
 బుడుగు ని ఇలా మనకు అప్పజెప్పేసి .. తాను తప్పుకున్న పెద్దాయనకు!
ఎప్పటికీ అయిపోని  ఈ బురుగు ఖదలకు, ఆ కథకుడి కలం పోషణకి......జై!
 ఆ పసితనపు పచ్చదనం పదికాలాలు పదిలం.పదిలం.
ముళ్ళపూడివారికి  జేజేలు పలుకుతూ.. అన్నట్లు, అదేంటో, ఆయనను వంటరిగా సాగనంపడం ఇష్టం లేక కాబోలు
అంకుల్ పాయ్ తోడెళ్ళారు.
సజల నయయాలతో ..సగౌరవంగా వీడ్కోలు.వారిరువురికీ.
ఇది ఎన్నటికీ అయిపోయేది ఆగిపోయేదీ కాదు కదా.

మరి వారి జ్ఞాపకంగా అందరూ ఒక మారు నుల్చుని, కళ్ళు మూసుకొని ,గొంత్తెత్తి, గాఠిగా, గడగడా  పదమూడో ఎక్కాం వప్పజెప్పేయండి!
కుదర్దూ?
ఎక్కాల బుక్కు తరవాత వెతుక్కుందురు.
ముందీ కథ చదివేయండి.

రాచ్చసుడూ ..పదమూడో ఎక్కం... ఖద..

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ఒక ప్రజా వైద్యుని జీవితంలోకి 1

డా.రాం
                          
అన్నకు తమ్ముడు లఘువా?
అన్న తమ్మునికి గురువా?
ఒక చేతి వేళ్ళయ్యా!
ఎక్కువ తక్కువ లెందుకు?
కె వి యార్,1967 )
21 జనవరి 1915 లో  పుచ్చలపల్లి వారింట కడపటి బిడ్డగా , శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడి గా పుట్టిన  రాం  1935-40  నడుమ మద్రాసులో వైద్య విద్య ను అభ్యసించారు వెంటనే ప్రజలకోసం వైద్యం ..ప్రారంభించారు. 21-4-67  ప్రజావైద్యునిగా చెరగని ముద్ర వేసి ,ఒక  అద్బుతమైన ప్రజా వైద్య శాలలో తన ఊపిరిని నింపి వెళ్ళారు.
 వృత్తికిప్రవృత్తికి నడుమ ,ఆయన జీవితం ఆలోచనలు,కార్యాచరణఆవేశంఉద్రేకంనిరాశ ,మనః క్లేశం ...ఎన్నిన్ని కోణాలో..  స్మారక వ్యాసాల్లో ఎంత వెతికినా  మానవుడు మనకు అంతుచిక్కడు కదా!
 అందుకేనేమో వారి వ్యాసాన్ని శ్రీ వేములపాటి అనంతరామయ్య గారు ,
"Do I know Ram ?" అంటూ మొదలెట్టి , అదే ప్రశ్న తో ముగించారు !

ఇందులో డా.రాం గార్ని సన్నిహితంగా ఎరిగిన మిత్రులు Prof.K.శేషాద్రి గారు,  జస్టిస్ గంగాదర రావు గారు,జి,కృష్ణ గారుడా.సంజీవ దేవ్ గారుడా, CR రాజగోపాలన్ గారు ,ఆచార్య పి.సి.రెడ్డి గారి వంటి అనేక మంది ప్రముఖులు డా.రాం గారిని వ్యక్తిగా 
పరిచయం చేస్తారువ్యక్తిత్వాన్ని మనకు స్పురింపజేస్తారు.
డి.రామచంద్రారెడ్డి గారు విశ్వోదయ తో డా.రాం గారి అనుబంధాన్ని తెలియ జేస్తూనే , వారి పరస్పర మైత్రి ని , వారి నుంచి వీరు పొందిన స్పూర్తిని..హృద్యంగా వివరిస్తారుప్రజలు వారి ఆరోగ్యం గురించి
 డా .కాకర్ల సుబ్బారావు గారు రాసిన వ్యాసం ఒకటి వైద్యరంగలోని మౌలికాంశాలను స్పృశిస్తుంది.
మధురాంతకం రాజారాంగారు కథాసాహిత్యం  లో సామాన్యుడి గురిచి అలవోకగా వివరిస్తేడాకొండప్ల్లి శేషగిరి రావు గారు , కాకతీయ కళలో వారి అనుభవాల్ని వివరించారు.
ఇవి ,కాకుండా అనేక సాహిత్యచారిత్రక ,సమకాలీన ప్రగతి పూర్వక అంశాలను రచయితలు స్పృషించి డారాం కు నివాళి గా సమర్పించారు.
కాకరాల గారు వ్రాసిన "మిత్రత్రయం " ,కెవియార్ గారి జోహారు పలుకుతూ అక్షరాల్లో గుమ్మరించిన అక్షరమల్లెల పరిమళం మనల్ని చాలా సేపు వదలవు.
వకుళాభరణం రామకృష్ణ గారు హెచ్చరించినట్లుగా ," డా.రాం  ప్రజా వైద్యుడుఉద్యమకారుడు.గొప్పవ్యక్తి .మంచి వ్యక్తి .కానీ పొరపాటునా   దేవుడిని చేసేసేరు !"
నిజమే సంచికలోని ప్రముఖ రచయితలంతాడా. రాం లొని విభిన్న కోణాలను ,ఆయా పరిమితులతో 
సహా పరిచయం చేశారు.
విఫలమైన ప్రథమ వివాహం గురించి మాట్లాడినా, "I smacked my wife! " అన్న  డా. రాం మాటను వక్కాణించినా , వారేమీ దాపరికం చూపలేదు.
తనలోలో ఇంకి పోయిన ఫ్యూడల్ భావ జాలపు అవశేషాల లో నుంచి బయట పడడానికి తను నిత్యం ప్రయత్నించినట్లుగాను, ఆ ప్రయత్నాలే అతనిని మరింత వత్తిడికి ఉద్వేగానికి గురిచేసినట్లుగాను తెలుస్తుంది. రాజ్యలక్ష్మమ్మ గారి ధృఢ వ్యక్తిత్వమే డా.రాం కు బాసట అని మనం గ్రహించ గలుగుతాం. పైనుంచి, ఆ అన్నకు తమ్ముడిగా , మొక్కవోని పోరాటపటిమ చూపారు . వారి జీవనమంతా అనేక ప్రయోగాల సమ్మేళనమై ,నిత్యం ఒక కొత్త కోణం తో ఆశ్చర్యపరుస్తుంది.
మార్క్సిస్ట్ గా ఉంటూనే , వారు ఆకర్షితులైన  ,నర్భవి , యోగావిధానం కూడా అలాంటిదే.
 ఒక వైపు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం "రాజకీయ అస్పృశ్యునిగా " ముద్రించి
యుద్ధానికి డా.రాం సేవలను నిరాకరించగామరో పక్క ..
తెలంగాణా రైతాంగ పొరాటంలో సుందరయ్య గారు మునిగి ఉండగా
పోరాటయోధులకు వైద్య సహకారాన్ని అందించడంలో ,ఒక ప్రజా వైద్యునిగా ఉద్యమకారునిగా  డా.రాం పోషించిన పాత్ర ను,రచించిన ప్రణాళికను ,కార్యాచరణనూ .. మనం తెలుసుకోవచ్చు
సుందరయ్య గారు 
. తెలంగాణా రైతాంగ పోరాటం అనంతరం పోగుపడిన  లెక్కకుమిక్కిలి ఆయుధాలు,బంగారంసంపద...
ఏ మైయ్యాయో తెలుసుకోవచ్చుపొగాకు వర్తకుల మైత్రి పార్టీ ని ,  చైనా పొత్తు పార్టీసారధులను  దిశగా మళ్ళించాయో తెలుసుకోవచ్చు.
జమీన్ రైతు నివాళిలో ఇలా రాశారు,(21-4-67)
”డా.రాం లోని కొన్ని వైరుధ్యాలు ప్రబలంగా పని చేశాయికేవలం వైద్యం వల్లనే ప్రజారోగ్యం చేకూరదని రాం భావన ."సాంఘిక వ్యవస్థ ,ప్రజల ఆర్ధిక జీవన జీవన విధానం సమూలంగా మారితేనే గానీ,  తిండి తిప్పల్లో ఒక మార్పు రానిదే కానీ,ఆరోగ్యం శుభ్రత చేకూరవు.  "అని ఆయన అంటుండేవారు.
"అందుకని నేను ఒట్టి డాక్టరుగా ఎంతకాలం ఉండేదిరాజకీయ వాదినై సాంఘిక మార్పు కోసం కృషి చేయాలి" అన్న కామన వారిలో ఉండేది.
కానీ, మొదటి సంతాప సభలో సుదరయ్యగారు చెప్పినట్లుగా,"డా.రాం ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలనే కోర్కెను ఎప్పుడు కనబరిచినా ,మేం చెపుతూనే ఉండినాం.వారిస్తూ వచ్చినాం.  నీవు డాక్టరువు. నీవు వైద్యుడిగానే ప్రజాసారూప్యత ను సాధించాలి. రాజకీయాలు వేరే వాళ్ళు చూసుకొంటారు అని నిరుత్సాహ పరుస్తుండినాం. అందువల్ల డా. మనః క్లేశాన్ని పొందుతుండే వారు. "
ప్రొ.కె.శేషాద్రి గారిలా చెపుతున్నారు. " పార్టీలోని కార్యకర్తలందరికీ కొంత వరకు వైద్యం తెలిసి ఉండాలన్న ఒక   పథకం డా.రాం సిద్ధం చేశాడు.గ్రామాలకు వెళ్ళి, బీదల మురికి వాడలకు వెళ్ళి పనిచేసే కమ్యూనిస్ట్ కార్యకర్తలకు కొంత ప్రథమ చికిత్స ,చిట్కావైద్యం, ఇంజెక్షను ఇచ్చేనేర్పు ఉండాలని ఆయన అభిప్రాయం. బీదరికం రోగాన్ని తెస్తుంది. బీదరికాన్ని, దానికి కారనమైన సామాజిక దోపిడీదారి విధానాన్ని ధ్వంసం  చేయడం ,చాలాకాలం తీసుకొంటుంది. ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేయాల్సి ఉంటుంది. అంతవరకు రోగాలు వేచి ఉంటవా?
అది long term plan ఇది short-term plan. ఈ రెండు ప్రణాళికలూ అవసరమే. ఈ విధంగా రూపుదిద్దుకున్న ఈ పథకాన్ని డా.రాం ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు."
అనేక మంది "బేర్ ఫుట్ డాక్టర్"లను తయారు చేశారు. ఈ నాడు డా.రామచంద్రా హస్పిటల్ ఇంతింతై పోస్ట్ గ్రాడ్యేషన్ కోర్సులలో శైక్షణ ఇచ్చే వైద్య సంస్థగా రూపొందింది. అదే డా రం గారి చిరకాల వాంచ. నెల్లూరులో ఒక వైద్య కళాశాల నెలకొల్పాలని. 
వైద్యం దగ్గరికి రోగి కాక ,రోగికి అందుబాటులో వైద్యం అన్న ది వారు విశ్వసించారు. పాటించారు. అలా ,మొదలయినవే, పీపుల్స్ పాలీ క్లినిక్, సంచార వైద్య శాల, మాస్ ఎక్స్ - రే ..తదితరాలు.
ఆయన అచరించిన మరొక ముఖ్య సూత్రం. కేవం వైద్యుడు కావడం కాదు. .నిపుణుడు కావాలి.నిపుణుడు కావడమే చాలదు.
సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు తన నైపుణ్యం వినియోగించాలి."
"డాక్టరు గారు శస్త్రపరికరాలకు మారుగా మాములు రేజర్ బ్లేడు ను వాడే వారు","తౌడును చక్కెర తొ కలిపి రోజుకో చంచాడు తిన మనే వారు " లాంటి  అనేకానేక అధ్బుత చమత్కారాల కబుర్లు ఇప్పటికీ పచ్చగా ఉన్నాయి  నెల్లూరియుల నోళ్ళలో నానుతూ.
వేయేల, డా.రాం కాలగర్భంలొ నడిచెళ్ళి , అర్ధశతాబ్ది దాటినా ,ఈ నాటికీ డా.రామచంద్రారెడ్డి ఆసుపత్రే , అనేక మంది బీదాబిక్కి కి ఆఖరి ఆశ ,ఆయువు .
వారు వెళుతున్నది డా.రాం ఆసుపత్రికి.
ఇంతకు మించి వైద్యరంగంలో ఒక వైద్యుడికి దక్కే ప్రజానివాళి ఏముంటుంది ?
***
వైద్యులైన ప్రతివారు తప్పించుకోలేని  బలమైన ఆకర్షణ  ఒకటి ఉన్నది.
ప్రాణాపాయ స్థితిలో  వచ్చి చికిత్స చేయించుకొని , బతికి బట్టకట్టిన  వారు సహజంగానే డాక్టరు గారిని, "ప్రాణం నిలబెట్టిన పరఃబ్రహ్మ  నీవని" కీర్తిస్తూఉంటారు.
అనగా అనగా, ఎంతటి వారికి అంతో ఇంతో అహంభావం పొడసూపక మానదు. ఏదో ఒక నాటికి.
మరి ఈ విషయమై డా.రాం గారు ఏమంటారో తెలుసా?
"అహంకారమా! పో ! పో!
కారాలన్నీ పోయి తీపి రావాలి!
ఎగో(అహంకారం) లేక పోవడమే యోగం .
 Divine  అన్న పదాన్ని డా రాం ఎలా విరిచారో చూడండి.
Divine  = De Wine..Remove the wine of Ahankaara  ,you become Divine."
తెలుగులోకి వారే తర్జుమ చేసి చెప్పారిలా,' అహంతో తప్ప తాగి మతిలేని వాడివైనావు.ఈ మత్తుపోతేనే నీకు యోగం పొతు కుదురుతుంది. అప్పుడే దయ్యం వదిలి దైవమవుతావు "
ఇలాంటి పదాల చమత్కారాలకు డా.రాం పెట్టింది పేరు.
వారి దోపిడి ... దో ..(రెండు) ..పిడి ( పిడికెళ్ళు)..ప్రపంచయుద్దాల సమయంలో నల్లబజార్లలోకి తరలిపోబోతున్న బియ్యాన్ని ఆయన ఈ "దో పిడి " ప్రణాళిక ను ప్రచారం చేసి , వర్తకుల నుంచి రెండు పిడికిళ్ళ బియ్యం ఇచ్చేట్టు చేశాడు.
ఇక, బీడీ కార్మికుల సమ్మె లో గొరిల్లా విధానాలయినా, రిక్షా కార్మికుల సమస్యల పరిష్కారాలైనా ,
.ప్రజా నాట్య మండలి కార్యకలాపాల నుంచి స్వయంగా పెట్టుబడి పెట్టి సినిమా తీసినా ..  ..అందుగలడిందు లేడనకుండా.
గర్జించినా గాండ్రించినా ,
కంటనీరుపెట్టినా, గుండెలవిసేలా ఏడ్చినా  ..
ప్రజాక్షేమమే ఆయన ఊపిరిగా జీవించిన వైద్యుడాయన.
గుడిసె పీకి వేస్తుంటే
అడ్డు పడిందెవరయ్యా?
.......................................... 
కనిపించిన ప్రతి రోగి
కన్న బిడ్డ కాదట్రా?
తన మన అంతరమేదీ?
తనువే మనకీ లేదా?

డా.రాం  వైద్యులకే కాక ఒక మానవుడిగాను మనకొక ఉదాహరణగా నిలబడడం లో వింతేముంది?

ఇంద మల్లె పువ్వు
ఇదో గులాబీ పువ్వు
మొదటి దశని మనసు
తుదటి గుండె దిణుసు
..(కె వి యార్)...


మరి మనం కూడా ఆ ప్రజావైద్యుడికి ఒక మల్లె పువ్వును ఒక గులాబీ రేకును ... సమర్పించకుండా ఉండగలమా?
సగౌరవం గా.
సవినయంగా.
***
డా.రామ్స్ సావనీర్ 
ప్రచురణ :
21.1.1998
డా.పి.వి .రామచంద్రారెడ్డి కాం స్య విగ్రహ స్థాపన కమిటీ,విశ్వోదయ క్యాంపస్ , 
కావలి -524201

డా.రామ్స్ సావనీర్ ఆవిష్కరిస్తున్న డా.కుప్పావెంకటరామ శాస్ర్తి,  ఎన్.శంకరన్, ప్రొ.శేషాద్రి 
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.