Oct 29, 2010

తలా ఓ పుస్తకం !

పిల్లలు వచ్చారు.
పుస్తకాలు చదివారు.
పరిచయం చేశారు!

నవంబరు నెల .
నెల్లూరు వానాకాలం.
జడి వానలో తడుస్తూ వణుకుతూ ..
పిల్లలు ..పుస్తకాలు...కబుర్లు.
ఆ విశేషాలు ఇక్కడ చూడండి.

http://prabhavabooks.blogspot.com/

***



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 27, 2010

అక్షరాలా... అపరంజి !

అదేంటో గానీ,చెడు వినొద్దు కనొద్దు అనొద్దు ...అని
అచ్చం మన గాంధీతాత అనుంగు మనవరాళ్ళూమనవళ్ళలా  ...అనుకుంటామా..
చెడు చూడకా తప్పదు.వినకా తప్పదు.
ఇక అనడం అంటారా, అది మన పెదవి దాటే పలుకు  కనుక ...ఎంతోకొంత మన అధీనంలోనే ఉంటుంది ...కనుక ఫరవాలేదు.
కానీ, చూడవలసిన  దృశ్యమూ ..వినవలసిన విషయమూ ..పరాధీనమే కదా !

నిన్న గాక మొన్న "అలనాటి నెల్లూరు"పుస్తకావిష్కరణ సభను ముక్తాయిస్తూ జ్ఞాపకం చేసుకొన్నాను.. పూర్ణమ్మను.
"నలుగురు కలిసి నవ్వేవేళల నన్నోపరి తలవండీ" అని అంటుందే ఆ మరుపురాని మాటలను.
పూర్ణమ్మ, మన తెలిగింటి పుత్తడి బొమ్మ.
 కాలం కదిలి పోయింది.కన్యాశుల్కం ,బాల్యవివాహాల దురాచారం సమసిపోయింది.
ఒక సంస్కర్త, రచయిత దార్శనికుని   ...ఆవేదన ఆలోచనై ..అక్షరాలా తీర్చిదిద్దిన అపరంజి ,మన పూర్ణమ్మ .
మన గుండెల్లో పదిలంగా నిలిచి పోయింది .అదాటున పలకరిస్తూ. ఒక దురాచారాన్ని గుర్తుచేస్తూ.
ఎవరింట పుట్టిందో ..ఎవరింట మెట్టిందో ..ఏ కోనేట గిట్టిందో ..కానీ ,
మన సాహిత్యంలో నిలిచిపోయిన చిట్టిచేమంతి, మన పూర్ణమ్మ.
*
చెడుచూడొద్దు వినొద్దు అని బుద్దిగా నమ్మే నేను, టివి సీరియళ్ళు గట్రాలకు ఆమడ దూరం కదా...అలాంటింది అదాటున ఒక దృశ్యం చూడవలసి వచ్చింది.
నేతి బీరకాయల్లో నేతినీ , సీరియళ్ళలో నీతినీ వెతికేంత అమాయకురాని కూడా కాదు కదా ..
అయినా ,
ఒక ముక్కు పచ్చలారని పసిబాలికను పెద్దముత్తైదువలా అలంకరిచి ,ముదినాపసాని మాటలతో ముంచి తేలుస్తూన్న..ఒక అత్యంతాదరణ పొందిన  సీరియల్ చూడనే చూసాను.
ఉమ్మడి కుటుంబం, బాల్యవివాహం, మేనరికం, అత్తల, అత్తల అత్తల సాధింపులు,నిప్పులగుండంపై నడకలు, ఆ పాప చెల్లించాల్సిన మొక్కులు,చదవ నీయకుండా చేయడానికి సవాలక్ష అడ్డంకులు ,పుస్తకాల సంచిలో పగిలిన గాజు ముక్కలు, పుస్తకం ముట్టుకొంటే రక్తసిక్తమయ్యే చెయ్యి, ఎడం చేత్తో పరీక్షరాసి "ఫస్టున" పాసవ్వడం, ఇక , ఆ పాప "భర్త" మరొక పసి బాలకుడు అదే పరీక్షలో ఫెయిల్ అవ్వడం, ఇక, విలనీ బామ్మలుతాతయ్యలు పెంచి పోషించే కాంప్లెక్షులు కాకరకాయలు!
 ఈ పాప కు పుస్తకాలు తోడుంటే "ఎదిగి పోతుందని" చేంతాడు చెత్తమాటలు గుమ్మరించి .. విలనీ బామ్మ పుస్తకాలు చించి చించి ..అపై సంచిని విసిరి కొట్టడం...
ఈ సుధీర్ఘ దైనందిన సీరియాల్.. నిరాఘాటం గా సాగిపోతూనే ఉంటుంది...
మిమ్మల్ని ఆ వివరాల్తో విసిగించను ...కానీ, అమ్మలారా అయ్యలారా...నేరాలు ఘోరాలు ఇంతకన్నా క్రూరంగా ఉంటాయా?
ఒక వైపు ఆడపిల్లలు ,వారి క్షేమాన్ని కోరేవారందరూ  ...బాలికల ఉనికిని ,జీవితాన్ని ,జీవనాన్ని ..పునర్నిర్వచించే ప్రయత్నాల్లో శతాబ్దాల తరబడి చేస్తోన్న పోరాటాలు...
 మరొక వైపు ,ఆమ్నియోసింథసిస్  నుంచి ఆమ్లదాడుల వరకు విస్తరించిన అత్యాచారాలు, 
బాలికలపై విచ్చలవిడివిడిగా సాగుతోన్న హింస ,దౌర్జన్యాలు, దుర్మార్గాలు...
నిశ్శబ్దం గా మనల్ని మరో వందేళ్ళు  గిర్రున వెనక్కు తిప్పే నడిపే ..ఇలాంటి ప్రజాదరణ పొందిన సీరియళ్ళు..
...అవి తీసిన వారు...చూస్తున్న వారు ..చేస్తున్న వారూ .. పదిలంగా ఉండగా ...
ఒక్క సందేహం. 
ఒకే ఒక్కటి.
వాళ్ళు బహుశా మరిచిపోయారో....  తలవనే  తలవ లేదో ..
గానీ , ఈ వ్యవహారమంతా .. మన మానవ హక్కుల ఉల్లంఘన కాదూ? 
మన మౌలిక మానవ సంస్కార వికాసానికి ప్రతిష్టంభన కాదూ?
ఆ బాల నటుల  మనోవికాసం నుంచి ,ఆ నటనను చూసి చౌడుదేరుతున్న బాల ప్రేక్షకుల మెదళ్ళ మొదళ్ళలోకి...
స్థిరపడుతున్న బాల్యహింస!
బాల పాత్రచిత్రణలో హింస ఇంత బాహాటంగా ,విచ్చలవిడిగా  ప్రకటించబడుతుండగా , 
త్వరలో పిల్లల పండుగ ఎలా జరుపుకోవడం?
కళలో కల్పనలో ఎదైనా చెల్లుదన్న పోయెటిక్ జస్టిఫికేషన్ , అర్టిస్టిస్టిక్ జస్టిఫికేషన్ ఇలాంటి వాటి విషయంలో ఇట్టే అంది వస్తుంది.
కల్పనలో ఏదైనా చెల్లుతుందనీ కాలస్థలనియమాలతో పని లేదనీ ..సమర్ధించేయవచ్చు.
కానీ, మన కంటిని మన వేలితో పొడిచే ఇలాంటి దురాకల్పనలు మనకెందుకు?
ఆయా పాత్రలలో "జీవిస్తున్న"బాలనటులు రాబోయే పిల్లలపండుగ రోజున ,"మహా బాలనటులని" బిరుదాంకితులయినా మనమేమీ ఆశ్చర్య పోనక్కరలేదు. ఆశ్చర్యపోము కూడాను!
ఇంటిగడప దాటని, ఊరిపొలిమేరయినా మీరని ..కొండల్లోకి కోనల్లోకి కూడా ఇలాంటి ..సీరియళ్ళన్నీ చేరుతున్నాయి కదా?
ఇప్పుడిప్పుడే అక్షరం చేతబట్టి ,  చేతనాక్రమంలో ...పరివర్తనా దిశగా... బుడి బుడి అడుగులు వేస్తున్నవారి ముంగిళ్ళ లోకి ..వెళ్ళి ఇవి తిష్ట వేస్తున్నాయి కదా?
హత్యలు,మాన భంగా లు,కిడ్నాపులు ,చేతబడులు,శవాలపూజలు , ఇప్పుడిక బాల్యహింస ..
ఇలా అడ్డూఅదుపూ లేకుండా ..ఈ విచిత్రవిన్యాసం సాగవలసిందేనా?
 పగ,కక్ష, ద్వేషం ,హింసలలో ముంచెత్తుతోన్న బాల్యాన్ని చూస్తూ ఊరుకొందామా?
మరొక పుత్తడిబొమ్మ ఈ నేలపై తిరగాడకూడదనేగా ఆ మహానుభావుడు  పూర్ణమ్మకు ప్రాణం పోసింది. 

ఇవాళ్టి ,బాలపాత్రల చిత్రణ గురించి వీసమెత్తు ఊహించగలిగినా , గురజాడ గుప్పెడు  గుండె ..ఎంతలా విలవిలలాడిపోయేదో..!
అంతటి ఆశయాన్ని తప్పుదోవ పట్టించి ..టీఆర్పిలు పెంచుకోవడం ..ఎంత విషాదం !

 సున్నితంగా సృజించవలసిన ..పువ్వులాంటి పిల్లల పాత్రల చిత్రణలో.. 
మాధ్యమాలు ఏనాటికైనా కళ్ళుతెరుచుకోవాలని ,
మనం కళ్ళు చెవులు  నోరు ...మూసుకొని 
 ప్రార్ధిద్దామా?

 బాలనటుల దుర్భరస్థితికి ,బాలప్రేక్షకుల దౌర్భాగ్య పరిస్థితికీ ,

రెండు నిమిషాలు మౌనం పాటిద్దామా?

పిల్లల పండుగ వేళ !

తెలుగుజాతి యావత్తు ..
సమిష్టిగా !

***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

గవ్వ మీది రంగులు

3
ప్రతిఫలం ఆశించని ఈ సాహితీ బంధువు బదులుగా కోరేది ఆగకుండా రాయడాన్నే.
రాస్తూ ఉండడాన్నే.
అయితే,ఎలా పడితే అలా రాయడాన్ని కాదు. 
మొదట రాసిన దానికన్నా మరింత మెరుగుగా రాయడాన్ని .
మరింత ఉన్నతంగా  రాయడాన్ని.

"ఆవేశంతో రాసుకు పోవడం ఇతర సాహితీ రూపాలలో కొంత మేరకు చెల్లుతుందేమో కానీ ,నవలా రచనలో చెల్లదు.మానవ విలువల ఆంతర్యాన్ని ఆవిష్కరించడానికీ ,నవరసాలను సముచితంగా చిత్రించడానికీ ,జీవితాన్ని ప్రతిఫలించడానికి ,విస్తృత అవకాశం ఉన్న నవల ఉత్తమ సాహితీ రూపం .నవలారచనకు ఎంతో అధ్యయనం ,అవగాహన కావాలి . రచన చేయ గలిగిన ఉత్సాహం ఒకటే చాలదు. నవలారచయితకు దీక్షాదక్షతలతో పాటు 
నిజాయితీ నిబద్దతలు ఎంతో అవసరం. ," చేరా గారు ఒక మారన్నారు ," ఆ అధ్యయనం అన్ని కోణాల్లోంచి మూలాల్లోకి జరగాలి. ఎంచుకొన్న విషయాన్ని ఎంతగా అర్ధం చేసుకొంటే అంతటి అర్ధవంతమైన రచనలు చేయగలరు.ఉత్తమ రచనకు వేరొక అడ్డదారి లేదు. సునిశిత పరిశీలన ,నిరంతర అధ్యయనం తప్పనిసరి."


చేరా స్వయానా నిరంతర పాఠకుడు.


కవిత్వం చదివింత  ఆప్యాయంగానే సాహిత్యాన్నంతా చదువుతారు.
మొదట భావం కోసం.మరల భాష కోసం.
పదం నుంచి పాట వరకు. వాక్యం నుంచి వ్యాసం వరకు.
కల్పిక నుంచి కథ వరకు.
నాటిక నుంచి నవల వరకు .ప్రాచీనం నుంచి అత్యాధునికం వరకూ.


చేరా ఒక రచనను కవిలా చదవగలరు. రసజ్ఞత పొందగలరు.
ఒక విమర్షకుడిలా చదవగలరు.ఆంతర్యం గ్రహించగలరు.
ఈ భావుకుడైన పండితుడి భావసాంద్రత ,పదసౌందర్యం ఆయన ప్రత్యక్షరంలో ప్రత్యక్షమవుతుంది.
ఈ మానస సంస్కారమే అంతః చేతనే ఆయన మానవసంబంధాలలోకి ప్రసరిస్తుంది.


ఆయన జ్ఞాపకాల చిరుజల్లులలో పిడుగుపాటులో , తడిచిన వణికిన దడిచిన  మనకూ .. ఆయన పట్ల సాన్నిహిత్యం కలుగుతుంది.గౌరవం పెరుగుతుంది.కిణాంకమై మిగులుతుంది.

"ఇచ్చట పీఠికలు రాయబడును .సమీక్షలు చేయబడును ," అంటూ ప్రకటనలు ఇవ్వక  పోయినా ,చేరా ఇంటికి కొనితెచ్చుకొన్న మొహమాటాలెన్నెన్నో! నిందలలో నిష్టూరాలలో నిలువునా తడుస్తూ !


ఒక మారు ,ఆయన ముందు ఓ పెద్ద కాగితాలకట్ట పెట్టుక్కూర్చున్నారు. ఆరా తీస్తే, అది ఎవరో కాలమిస్టు మిత్రుడు రచించిన వందలాది , బహుశా వేలాది,కాలమ్స్   కవిలకట్ట.
ఆ వేలాది చిరిగిన చెదిరిన నలిగిన కాగితాల నుండి ఓ వంద ఉత్తమ రచనలను  ఏర్చికూర్చి పెట్టమని చేరాను కోరారా మిత్రుడు. పనిలో పనిగా పీఠికా రాయమని.ఆ తరువాత సమీక్ష చేయమని !

చేరా గారు అప్పటికింకా "గుండె కోత "  నుంచి  తేరుకున్నట్లు లేదు! ఈ వ్యవహారమంతా వారి శ్రీమతి గారికి గుండెకోతగా పరిణమించింది!
స్నేహబంధం పట్ల గౌరవం కొద్దీ మొహమాటం కొద్దీ , ఆ పనిని చేరా సంతోషంగా చేయ  బూని ఉండొచ్చు కాక ! ఇలాంటి కూర్పుకర్త పనేనా చేరా మాష్టారు చే వలసింది? దానివలన చివరకు మిగిలేది ఏముంది ? మాష్టారి ఆరోగ్యానికి చెరుపు కాక ! కుటుంబసభ్యులకు వెరుపు కాక!
చేరా ప్రధాన కృషీ ప్రత్యేకకృషీ చేసిందీ చేస్తున్నదీ భాషాశాస్త్రంలో .ఇది ఆయన ప్రత్యేకత .ఇదే అసలు సిసలు ప్రత్యేకత.ఇదే ఆయనే చేయగలిగిన ఆయన పని !
ఈ రంగం లో చేరా జీవిత కాల కృషి ఇంకా అక్షరబద్దం కాలేదు. "అది నా బద్దకమే .." అంటూ పకపకా నవ్వేయడం చేరాకు అలవాటే.
హోంవర్క్ చేయడానికి పాలుమారిన పిల్లవాడూ మాట మార్చేయాలని నవ్వే నవ్వులు రువ్వుతూ.
ఆయనే చేయగలిగిన ఆయన పనిని చేసేట్లు చూడవలసిన బాధ్యత చేరాభిమానులందరిదీ. మాష్టారి చెవి మెలిపెట్టయినా సరే!

తడి ఇసుకలో  లో అదాటున దొరికిన గవ్వ మీది రంగుల్ని చూసి సంబరపడే పిల్లవాడూ.. 

స్వేచ్చకూ చైతన్యానికీ .. సూక్ష్మానికీ స్థూలానికీ  .. ప్రజ్ఞకూ విజ్ఞతకూ ..సౌందర్యానికీ సౌజన్యానికీ ..
నడుమ ఒక సమన్వయ ప్రమాణాన్ని చూపగల పండు మేధావి ..


ఆయనలోనే ఉన్నారు.


మనందరికీ చేరువలో ...


 మన చేరా!


*
("మన చేరా" సంకలనం ,"చేరా పై రాతలెందుకని ..!?!" నుంచి  కొంత , 15-4-2003)


*
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 23, 2010

ఒక్క కారణమే

2
 జగమెరిగిన సాహితీపెద్ద చేరాకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు.
ఒక కవిగా కళ్ళు తెరిచి ,భాషాధ్యయనం చేస్తూ   ,పరిశోధిస్తూ ప్రతిపాదిస్తూ
-అటు సాహితీ విమర్షకునిగా ఇటు భాషాశాస్త్రజ్ఞునిగా ప్రసిద్దికెక్కారు. శ్రీ చేకూరి రామారావుగారు.
  
ప్రామాణికమైన చేరా రాతలు ఎన్నో కొత్త కలాలకు అండగా నిలిచాయి. కొత్త కొత్త వాదనలు ,ధోరణులు , సిద్ధంతాలు మూర్తిమత్వం పొందడానికి మూలమయ్యాయి. ప్రాచీన, ఆధునిక, అత్యాధునిక సాహిత్యాన్ని  సాహితీవేత్తలను వారి ప్రత్యేక స్థానాలలో నిలబెట్టాయి.
ఇది సాహితీ సత్యం.
చేరాది మానవ స్పృహ . విపులతత్వం. ప్రజాస్వామ్యదృక్పథం.అంతర్జాతీయదృష్టి.
కొడొకచో ,చేరా సహృదయాన్ని మెట్టులా చేసుకొని ,కొండెక్కి  కూర్చున్న సాహితీరాజులు రాణులు చేసిన పిల్లచేష్టలకు ,ఆయన నవ్వేసి ఊరుకోవడమే కానీ, సాహితీ ద్వేషం  ప్రకటించిన దాఖలాలు లేవు.

సాయంకాలం కలిసి ,కాస్సేపు కాలక్షేపం చేసి ఆ "కాస్త" రాయించుకోవచ్చు "నంటూ చేసిన గాలిప్రచారాలకూ ఆయన అంతే తేలికగా నవ్వేసి ఊరుకోలేదూ?
దుయ్యబట్టినా దుమ్మెత్తిపోసినా ,శాపనార్హ్దాలు పెట్టినా ,హేళన చేసినా ,మనసు విరిచినా , చేరా తన విమర్షలో ప్రజాస్వామ్య దృష్టినీ నిజాయితీని నిబ్బరాన్ని విడవలేదు.
అందుకు కొండంత గుండె కావాలి.
మేధో ప్రజ్ఞ తో పాటు మానససంస్కారం  కావాలి. పండిన విద్వత్తుతో పాటు పసిపిల్లవాడిలా స్పందించగల నిష్కపట మైన  మనస్సు ఉన్నాయి కాబట్టే , చేరా ఉత్తమ సాహితీ విమర్షకులు కాగలిగారు.
ఎలాంటి పటాటొపం లేకుండా కొత్త గొంతులతో గళం కలపగలిగారు.
ఇదీ చెరగని అక్షరాలతో చేరసిన చేరాతల ప్రాధాన్యత.
*
రాయడానికి ఒక్క కారణమే ఉండొచ్చు.
రాయలేక పోవడానికీ ఒక్క కారణమే ఉండొచ్చు.
"గొప్పకవి అయి ఉండొచ్చు. గొప్ప విమర్షకుడు అయిఉండొచ్చు" ద్వారకానాథ్ గారి లాగా టి.టి. ఐ .లా మిగిలి అజ్ఞాతంలోకి అంతర్ధానమై పోయి ఉండొచ్చు.
జగడం లక్ష్మీ నారాయణ గారి లాగా "గనుల్లో పర్సనల్ ఆఫీఅసర్ గా మిణుకుతూ ఉండొచ్చు." రచయిత్రిని మింగిన రాజకీయాల్లో భాగమై  మిగిలి ఉండొచ్చు.
తెలంగాణా  విప్లవోద్యమం మలిదశను ఖండకావ్య కుసుమాలుగా  వికసింపజేసి , 
సాహితీచరిత్రలో సముచిత స్థానం పొందవలసిన గంగినేని వెంకటేశ్వరరావు గారి వంటి సాహితీమూర్తులు కావచ్చు.
కరుకు పదాల దాపున పడిన సాహితీ విమర్షకుల సుతిమెత్తని హృదయం కావచ్చును చిన్ననాటి స్నేహాల చిలిపిగుర్తులు కావచ్చు.
రచనలతో పాటు ఆయా సాహితీవేత్తలతోనూ సాహితీబంధువులతోనూ చేరాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏర్పడిన ఆ మానవ సంబంధాలు, అవి నేర్పిన సంస్కారమే ఆయనలోని వెలుగు.
 సాహితీ వేత్తలుగా ఎదగలేని ఎదగనీయని ఆ అనివార్యపరిస్థితులకు స్పందించిన ఆర్ద్రత, సాహితీ చరిత్రకారుల మరూలో మాయం అయిన మసకబారిన సాహితీ వేత్తలను గుర్తించిన శోధన ,వృత్తి కాఠిన్యంలో వెలువడని కరుణార్ద్రత ను    గ్రహించ గలిగిన హృదయ స్పర్ష ..చేరా గారిది.
మానవ సంబంధాల పట్ల చేరాకు గల గౌరవం ,ఆప్యాయత, తన బలహీనతలను తనే చెప్పుకోగలిగిన బలమూ ,చేరాను మనకు మరింత సన్నిహితం చేస్తాయి.

"ఈ పుస్తకంలో చాలా అంశాలు నా పరిశోధన ఫలితాలయినా,ప్రత్యక్షరమూ నా సొంతం కాదు. నా కంటే ప్రజ్ఞా వంతులైన పూర్వుల ఆలోచనల పునాదిబలంపైనే ఈ ఆలోచనలు సాగినాయి."

ఈ చే రాత పాతికేళ్ళకు పైగా భాషాశాస్త్రంలో ప్రామాణిక గ్రంథంలా అధ్యయనం చేయబడుతున్న "తెలుగు వాక్యం "పీఠిక లోనిది.
ఎదిగిన వారు ఎంతగా ఒదిగి ఉంటారో తెలియాడానికి ఈ ఒక్క చేరాతా చాలదూ ?

చేరా రాస్తారు కదా,"ఏ తరం వారయినా తమ వెనకటి తరం వారికి ఋణపడి ఉంటారన్నది ఋజువు చేయక్కర లేని నిజం. ఎన్నటికీ తీర్చుకోలేని ఋణానుబంధం అది."


ఆ విధంగా చేరా గారితో మనదెంత ఋణానుబంధం !

("మన చేరా" సంకలనం ,"చేరా పై రాతలెందుకని ..!?!" నుంచి  కొంత , 15-4-2003)



 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 20, 2010

పువ్వుల కొరడా

పదాలు పువ్వుల లాంటివి.
పదాలు కొరడాల లాంటివి.
పదాలు పువ్వుల కొరడాల లాంటివి.

వాక్యాలలోకి ఒదుగుతూ ..
భావోద్వేగాలను పొదుగుతూ..
పలకరిస్తూ..పరామర్షిస్తూ..
పరీక్షిస్తూ..పరిచయం చేస్తూ..
విమర్షిస్తూ..విపులీకరిస్తూ..
వెన్ను తడుతూ ..వెన్నంటి నడుస్తూ..
భాసిస్తూ ..భాషిస్తూ..
విరబూసిన ఆత్మీయ పదాలు..
చేరాతలు.


భాషతో చెలిమి చేస్తూ ..చెట్టాపట్టాలు వేసి తిరుగుతూ ..
గాలివాటున నేలరాలిన పూల సుగంధాలను .. మొగ్గ విప్పుతోన్న కుసుమ సౌరభాలనూ ..
విప్పారిన పుష్పసౌందర్యాన్ని ...
ఆస్వాదించి ..
అపురూపంగా సేకరించి,గుదిగుచ్చి, 
ఆ సుమహారాన్ని ఆప్యాయంగా ..మనకు అందంచిన పెద్దలు... 
పసివాడని .. చేరా.

ఎందరెందరి రాతలనో తిరగరాసిన , తిప్పి తిప్పి తిరగమోత వేసిన ..
చేరాపై రాతలెందుకని ?

సాహిత్యంలో లక్ష వైవిధ్యాలుంటే ,సాహితీ విమర్షలో సవాలక్ష వైరుధ్యాలుంటాయి.

భావవ్యక్తీకరణకు సాహిత్యం ఓ స్వేచ్చామాధ్యమం.
స్వంతంగా స్వతంత్రంగా వ్యక్తమయ్యే భావానికి కొలమానం ఏమిటి ?
తప్పేమిటో ఒప్పేమిటో తూకం వేయడమేమిటి ?
స్వరూప స్వభావాల పరిమితులేమిటి ?
నియమనిబంధనాల పరిధులేమిటి ?
ఏమిటీ దబాయింపు ?

మరలాగే కానీ , క్షీరనీర న్యాయం జరిగేదెట్లా?
అకవుల మెడలో గంట కట్టే వారెవరు?
వారు..
అకవిత్వం నుంచి కవిత్వాన్ని వేరు చేయడం , తిరోగమన వాదుల నడ్డి విరచడం , దారి తప్పిన వారిని ఛళ్ళున చరచడం, స్వార్ధ సంకుచితాల నుండి సాహిత్యాన్ని సాహితీవిమర్షను రప్పించడం .. వ్యక్తి ద్వేషం నుండీ వర్గద్వేషం నుండీ  రచనను కాపాడడం ..ఇలా ఎన్నెన్నో  చేయవలసి ఉంది.
అంతేనా ?
భిన్న సంకుచితాలతో సాహితీరంగంలో ఏర్పడిన వివిధ పీఠాల బారినుండి ..ఆ పీఠాధిపతుల బారినుండి  ..స్వేచ్చాగళం కుత్తుకలుత్తరించే "ముద్రా" రాక్షసం( BRANDING) బారినుండి..
నలగనీయక అయోమయంలో జారనీయక..
కొత్తకలాలకు ఒక సంయమన విమర్షాపద్దతిని పరిచయం చేయాల్సి ఉంది.
అన్నిటికీ మించి ..
ప్రజాస్వామ్య భావాలను మానవవిలువలను ప్రతిష్టించాల్సి  ఉంది.
మానవ స్ప్రుహతో. మానవస్పర్ష తో.
మళ్ళీ  మళ్ళీ.

అప్పుడే కదా..
ఉన్నత సాహితీ ప్రమాణాలను సాధించే వీలు కలుగుతుంది.
ఉత్తమ సాహితీ సృజనకు ఊపిరిసలుపుతుంది. సాహితీసౌజన్యం సర్వబాహుళ్యమవుతుంది .
సరిగా అలాంటి సౌహార్ద్ర వాతావరణాన్ని ,సాహితీప్రమాణాన్ని అందించాయి చేరా రాతలు.
అవి చేరాతలైనా.చేరా పీఠికలైనా .
తెలుగు వాక్యమైనా. లక్షణ చర్చయైనా. 
ముత్యాలసరాల ముచ్చట్లైనా .
అనుభవాల దొంతరలైనా. అధ్యయన పాఠాలైనా.
జ్ఞాపకాలతో కాచినకాయలైనా.

("మన చేరా" సంకలనం ,"చేరా పై రాతలెందుకని ..!?!" నుంచి  కొంత , 15-4-2003)


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 13, 2010

గిరిజనాత్మకం !


"నేను నాగురించి ఈ రోజు రాయదలుచుకొన్నాను" అంటూ పి.పద్మావతి మొదలు పెడితే, "ఈ అవకాశం మాకు వస్తుందను కోలేదు" అని అంటుంది పార్వతి.
'చిన్న కుటుంబము చింతల్లేని కుటుంబము. కానీ, మాది చిన్న కుటుంబము పేద కుటుంబము ." 
..ఈ భూమిపై ఆవర్భవించిన మానవ పక్షి యొక్క ఆత్మవ్యధ .." అంటూ తన జీవిత విషాదమేమిటొ వివరిస్తాడు భూక్యా శివ S/O మదర్ సుగుణ .

అమ్మ, నాన్న, ఆకలి, చదువుకోవాలన్న తపన, పట్టుదల ..వీటన్నిటినీ ,అక్షరాల్లో అద్ది మన ముందుంచారు కారేపల్లి కళాశాల విద్యార్థులు. గిరిజ గా మలిచి.
 కొన్ని రచనలు  చదువుతుంటే , నిండా పదహారేళ్ళు లేని ఈ పసిబిడ్డలు ఎంత ఎదిగారో కదా , వారి జీవితం ఎన్ని పాఠాలు నేర్పిందో కదా ,అనిపిస్తుంది. 
వినగలిగిన మనసుంటే, ప్రతి రచన మనకు ఒక కొత్త జీవిత పాఠాన్ని పరిచయం చేస్తుంది.
 గుండె చెమ్మగిల్లే ఈ రచనలు ,
" మాకూ ఉన్నాయ్ బాధలు ..మాకూ ఉన్నాయ్ కలలు ..మాకూ ఉన్నాయ్ కన్నీళ్ళు..  వినే ఓపిక మీకుందా? " అని నేరుగా ప్రశ్నిస్తున్నాయి.
మరి మీ సమాధానం ఏమిటో మీరే నిర్ణయించుకోండి!
***
ఏ. నిరోష రాస్తున్నది కదా,
“నేను మొదటి సారి చేసిన తప్పు అవునో కాదో నాకు తెలియదు.అది ఏమిటి అంటే ,మా ఇంటి పక్కన వాళ్ళకు తినడానికి సరిగా  బియ్యం ఉండేవి కావు.వాళ్లు మా అమ్మ లేకుండా చూసి నన్ను అడిగే వారు. వాళ్ళను చూస్తే నాకు బాధ అనిపించేది.వాళ్ళు అడిగినప్పుడల్లా నాకు బాధ అనిపించేది.వాళ్ళు అడిగినప్పుడల్లా నేను బియ్యం ఇచ్చేదానిని." అంటూ తన జ్ఞాపకాలు పంచుకొంటోంది .
అంతే కాదు, జ్వరం వచ్చి కామెర్లు సోకిన తండ్రిని పసిబిడ్డలా చూసుకొని, అలసిసొలసిన  అమ్మకు  చేదోడు గా కూలీ చేస్తూ తండ్రి ని ఆరోగ్య వంతుణ్ణి చేసుకొంది. ఇప్పుడు  ఒక ఆరోగ్యకార్యకర్త గా శిక్షణ పొందుతున్నది!

“ నాకు నేను నచ్చ లేదు " అంటూ ఒక విద్యార్థిని ఎందుకు తనకు తాను నచ్చలేదో వివరిస్తే,మరొక అమ్మాయి ఆ 
నచ్చనితనాన్ని ఎలా అధిగమించను చేయదలిచిన ప్రయత్నాలనూ చెపుతుంది.

"నాకు అన్నం ఎలా దొరుకుతుంది ? " అని ఒకరు ప్రశ్నిస్తే, తమకు పిడికెడు మెతుకులు, గుప్పెడు అక్షరాలు  అందివ్వడం కోసం ,అమ్మానాన్నలు పడే కష్టాలను కళ్ళకు కట్టేట్టు చిత్రించారు  ఈ కొండ పిల్లలు.

"నర్సింగ్ అంటే ఎవరికైనా చులకన. చాలా మంది నర్సింగ్ చేసున్నామని చెప్పుకోవడానికే సిగ్గుపడతారు."అని చెపుతూ తానెందుకు నర్సింగ్ చేయ దలుచుకొందో చెపుతుంది, నర్సింగ్ వలన సమాజసేవ ఎక్కువగా అలవాటు అగును "..అని.
మరి మీరు గణితి వెంకయ్య అనే నాయకుడి గురించి విన్నారా?
"నాకు నచ్చిన నాయకుడంటే,మంచి వాడు,ప్రజల బాధలను తెలిసిన వాడు, మనస్సు సున్నితమైనదిగా చెప్పుకోవచ్చును.' అతను డి.బాలాజీ ఊరి నాయకుడు, బాలాజి ఊరినంతటినీ  “ వెంకయ్య గుంపు “ అనేవారంటే ,అతను ఎంతటి నాయకుడొ , గ్రహించమంటున్నాడు బాలాజీ.
ఇక, మన రాజకీయ నాయకులు వెంకయ్య నుంచి నేర్వ వలసింది ఏమిటో మీరు
గ్రహించారు కదా?
" మనలో కూడా ఈ ఆలోచన అనేది మార్పు తీసుకు వస్తుందా? అని అంటారా?  తప్పకుండా తీసుకు వస్తుంది. ఎప్పుడంటే ! మనం ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు. ఆలోచిద్దాం .మనలో మార్పును ఆహ్వానిద్దాం " అంటుంది శశిరేఖ.
అందుకేనేమో, దరువేసి మరీ చెపుతోంది శారద," అమ్మాయి జీవితం "లో మార్పును ఆశిస్తూ,

"అమ్మా మీకు చెపుతున్నా వినవే అమ్మా
నాన్న మీకు దండం పెడతా వినవా నాన్నా (2)
నాతోటి వాళ్ళందరూ  "ఓహో "
బడికి వెళుతుంటే " ఆహా"
నాకు వెళ్ళాలనిపిస్తుంది ఓ నాన్న
నన్ను కూడా బడికి పంపించవే అమ్మా  (2)"

" ...సార్ , మానవత్వం పోయింది. దాని విలువ వంద రూపాయలు. ఈ గదిలో ఎవరికైనా దొరికిందా?" అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే  హృద్యమైన కథ ఎం.మోహన్ ది. 

ఇవే కావు, "తిన లేని పండు" "తలపాగారాజు " వంటి సరదా కథలూ ఇందులో ఉన్నాయి. 
వ్యక్తిత్వ వికాసం , సైన్సు పాఠాలు ,సుస్థిర వ్యవసాయం, పర్యావరణం 
 అధ్యాపకుల అభిప్రాయాలు ,కవితలు,సామెతలు, అవీ ఇవీ అన్నీ ..ఒక్క చోట ప్రోది చేసారు ..వీరు.

" సీతాఫలం చెట్టు ను చూస్తే ప్రతి మానవుడి నోరూరుతుంది .దాని మీద నిగనిగ లాడుతున్న పండు ,సీతాఫలం కాయ,కు ఏం తెలుసు మనుష్యులందరూ పండు కోసం చూస్తున్న సంగతి ? చెట్టు గుట్టును రట్టు చేసేది (తెలిపేది)  పండు, సీతాఫలం కాయే, కదా? "అని రాస్తూ జి శివాజి ఇలా ముగిస్తాడు ," అలాగే మా అమ్మ యొక్క ఆత్మీయత గురించి మా అమ్మ వాత్సల్యం గురించి గాని, మా అమ్మ మన్స్సు గురించి గాని ,ఒక కొడుకుగా మాతల్లి యొక్క బాధను తొలగించి , నిజమైన పుత్రుడిగా నడుచుకొంటాను" అంటాడు శివాజి , అమ్మను చెట్టుతో ,తనను పండుతో పోల్చుకొంటూ.
కొండా కోనల్లో ఆడుతూ పాడుతూ పెరిగే ఈ గిరిసంతతి , పలకాబలపం బట్టి ,అక్షరం నేర్చి , బడి మెట్లెక్కి ,కళాశాల లోగిలిలో నిలబడి , చేస్తోన్న అక్షర చమత్కారం ఈ "గిరిజ" .
కారేపల్లి ప్రభుత్వ  జూనియర్ కళాశాల , వార్షిక సంచికను ఒక సాహిత్య సంచిక గా రూపొందించడంలో అధ్యాపకుల కృషి ,ప్రధానోపాధ్యాయుల వెన్నుదన్ను స్పష్టంగా కనబడుతున్నాయి.
వారికి ధన్యవాదాలు
ప్రభుత్వ కళాశాలు ఇంత చక్కటి ఉదాహరణగా నిలబడడం  కన్నా ఆనందం ఇంకేముంది?

ఈ పిల్లల మాతృ భాష తెలుగు కాదు. తెలుగు నేర్చి ,ఆ తెలుగునే తమ ఆలోచనలకు అనుభూతులకూ వ్యక్తీరణమాధ్యమం గా  వారు మలుచుకొన్న తీరు, 
మనం తెలుగు వాళ్ళం అమ్మ మాట మన నోట పలికితే నామోషిగా భావించే ముందు, 
ఒక మారు ఆలోచించాలి మరి !
పరభాష  మీద వారు సాధించిన పట్టు , ఎంతో అభిమానం గా ఆప్యాయంగా పదాలను అల్లుకొన్న తీరు ముచ్చటేస్తుంది .కదండీ.
అందుకై,
ఎంతో శ్రద్ధగా తరగతిని సృజనాత్మకం గా మలిచిన   తెలుగు అధ్యాపకులను వారు  చేసిన కృషినీ ,
మనం అభినందించక తప్పదు.

ఇంత మంచి ప్రయత్నం చేసిన కవి సీతారాం గారికి ధన్యవాదాలు.

***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 7, 2010

అఖిలాంధ్ర పాఠకులకు

అసలు సిసలు వైరాగ్యం అంటే ఏంటో-
నన్నడగండి. చెపుతా.
అచ్చమైన స్వచ్చమైన వైరాగ్యం అంటే ఏంటో-
అదీ నాకు తెలుసండోయ్!

చిదంబర రహస్యం..
నేనేదో  అడ్డొచ్చిన అడవుల బట్టో..
ముక్కు మూసుకొని ఒంటికాలిమీద తపస్సులు చేసో..
కనబడ్డ గ్రంథాలయాల్లోఅంతా దూరేసి..
చేతికందిన పుస్తకాన్నల్లా గిరిగిరా తిప్పేసో..
గురూజీఅమ్మాజీ శిష్యరికం బట్టో ..
చెప్పిన బోధలన్నీ శ్రద్ధగా చెవిన బట్టో..
తెలుసుకోలేదండోయ్!

పోనీ,  బుద్ధిగా  కూర్చుని  ధీర్ఘంగా చింతన చేద్దామన్నా  , 
మా వీధిలో రావిచెట్టైనా లేదయ్యే !


ఉన్న దాన్ని ఉన్నట్టు ఊరక ఉండక..
అడపా దడపా పుస్తకం అచ్చేసి ..
తెలిసేసుకొన్నా!

అదండీ విషయం!

అసలు సిసలు వైరాగ్యం అంటే..
"అచ్చు వైరాగ్యం..!"
అచ్చమైన స్వచ్చమైన వైరాగ్యం అంటే...
"ప్రచురణ వైరాగ్యం.. " అన్న మాట !!!

చూడండి.
ఎప్పుడు పుస్తకం అచ్చేసినా ..
ఖరాఖండి గా ఖచ్చితంగా..
అనుకుంటాం కదా .. "ఇదే ఆఖరుది !" అని.

ఇంతలోనే అర్ధ రాత్రో, లోలోపల .. చిన్ని ఆలోచన తొలవడం మొదలవుతుంది
అంతే!
ఆలస్యం చేయకుండా , తెల్లారే  అచ్చుపనిలో పడతాం
బోర్లా బొక్కలా!

"అఖిలాంధ్ర పాఠకులకు అక్షర నీరాజనం " అంటూ నోరారా మంగళగీతాలు పాడుకొంటూ "అచ్చు హారతి "ఇచ్చే లోగా..
ఉన్న శక్తియుక్తులతో పాటు
పోపుడబ్బాల్లో బట్టలదొంతర్లో దాచిఉంచిన కొద్దిపాటి రహస్య నిలవలతో సహా ..
సమస్త నిధులూ ..కర్పూరంలా ఇట్టే హరించుకుపోతాయి!

అవన్నీ సరేతాజాగా తళ తళలాడుతున్న సరికొత్త పుస్తకం , అందునా సొంత పుస్తకం, చేతిలోకి తీసుకోగానే ...
లెక్క ప్రకారం ..
పురిటికందు ను తొలిసారి పొత్తిళ్ళలోకి పొదివి పట్టుకున్న అమ్మ లా మురిసి పోవాలా...
అదేంటొ గానీ..
బిడ్డ టీకాల ఖర్చునుంచి ట్యూషను ఫీజుల వరకు , పురిటిస్నానం నుండి ఉద్యోగ ప్రస్తానం వరకూ.. తారలను తాకే ధరచీటిలు తల చుట్టూ గిర గిరా తిరుగుతుంటే ,వెలాతెలా బోయే ...నాన్న లా ..నిలబడిపోతాం!
కొత్త పుస్తకానికి .. అందులోనూ తెలుగు పుస్తకానికి.. అమ్మయినా నాన్నయినా ... 
పాపం .. రచయితేగా!

ఫలానా పుస్తకానికి ఇన్నిన్ని మిలియన్ డాలర్లు ముందస్తు చెల్లింపులు జరిగాయనో ..
ఫలానా రచయిత ఒకానొక ద్వీపంలో రాజభవనంలో పూలతోటల్లో నివసిస్తాడనో .. విన్నప్పుడు ...   కాకమ్మకబుర్లు కట్టుకథలు గా ఎందుకు తోచవు మరి?
సరే, అవన్నీ మనబోటి వాండ్ల ముచ్చట్లు కావు కానీయండి.
అవలా ఉంచండి.

రాసినదేదో రాసినట్లు ఊరుకోక ,తగుదునమ్మా అంటూ అచ్చేసుకోను వెళ్ళడం దేనికి ?
అచ్చుతప్పులు దిద్దుతూ ,అక్షరాలు పేరుస్తూ ..బొమ్మలు గీయించుకొంటూ ,పేజీలు అలంకరింపజేసుకొంటూ ,
బైండింగులను పరిశీలిస్తూ , ఒట్టిఅట్టా ...గట్టి అట్టా ...బేరీజులు వేసుకొంటూ..నిర్ణయాలు తీసుకొంటూ ... 
దుమ్ముధూళిలో పడిపోకుండా కాస్త కనబడేలా పుస్తకాన్ని ,
అరల్లో అమర్చమని అంగళ్ళ వారికి బతిమిలాడుతూ.. విజ్ఞప్తులు చేస్తూ ,


పరిపరివిధాలుగా .. పదే పదే శుభకార్యంలో మునిగి తేలుతూ...
నిశ్శబ్దంగా చేతిలో వచ్చి పడే బిల్లును చూసి కూడా , గుండె నిబ్బరం చేసుకొంటూ..
ఉండే క్రమంలో ..


అసలు రచయిత చేయ వలసిన రచనలన్నీ కొండెక్కుతాయంటే , ఎక్కవు మరీ?

ఇక ,అచ్చుతప్పుల దిద్దుబాటు కార్యక్రమం పుస్తకం అచ్చయ్యాక కూడా
నిద్రనడకలా పగటికలలా వదలక వెంటాడం లో వింతేముందీ?

చుట్టూ గుట్టలు పడ్డ అట్టపెట్టెలోంచి అందమైన ముఖపత్రాలు వెక్కిరిస్తుంటే
మంచం కిందా, అటకల్లో .. ఎక్కడపడితే అక్కడ , వాటిని దూర్చేసి పేర్చేసి ,
అటు వెళుతూ ఇటు వెళుతూ .. 
కాలి  బొటన వేలికి ఎదురు దెబ్బలు తగిలించుకొంటూ
బీరువా మీద నుంచో దభీలున వచ్చి పడే బౌండు పుస్తకం నుదుటికి కట్టించే బొప్పిని తడుము కొంటూ ..
మరికొన్నాళ్ళు ఇలా పుస్తకాల దొంతరల మధ్య సహజీవనం చేయాలన్న
 సత్యాన్ని ఇంట్లో వారందరూ జీర్ణం చేసుకొంటూ..

" ఇదే అచ్చు వేసే ఆఖరు పుస్తకం !" అంటూ అడిగిన వారికీ అడగని వారికీ వివరణలూ సవరణలూ గట్రాలన్నీ సవినయంగా సమర్పించేస్తూ.. 
నిట్టూర్చి నిమ్మళపడే లోగా..

మరి ప్రచురణ వైరాగ్యం కలగదేంటండీ?

*
ఒక్క నిమిషం.
ఎవరిదో చిట్టిసందేశం.


"మీది ఫలాన పుస్తకం ఎక్కడా దొరక లేదండీ. ఎన్నాళ్ళుగా వెతుకుతున్నానో! ఎక్కడ అడిగినా లేదన్నారు.మీ దగ్గరేమైనా ఉందేమోననీ.."
"అది అయిపోయింది.అచ్చేయాలి."
వేయండి మరి! "
*
తథాస్తు !

***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.